ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయచోటి ఉగ్రస్థావరాల వ్యవహారంలో షాకింగ్ వాస్తవాలు.. డీఐజీ కీలక అప్‌డేట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 07:58 PM

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటు అంశం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక సమాచారం వెల్లడించారు. పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. తమిళనాడు ఐబీ పోలీసులు.. అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీ అనే ఇద్దరు ఉగ్రవాదులను రాయచోటిలో అరెస్టు చేశారు. 'అలూమా' అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వీరు దేశంలోని మూడు నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుకి సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ.. రాయచోటిలో నిందితులకు సహకరిస్తున్న వారిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. దాదాపు 50 ఐఈడీలు (పేలుడు పదార్థాలు) తయారు చేసేందుకు కావాల్సిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఐసిస్, అలూమా సంస్థలు ఒకే విధమైన ఆలోచనలతో పనిచేస్తాయని ఆయన అన్నారు. అలూమా అనేది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని డీఐజీ పేర్కొన్నారు. రాయచోటిలో కొత్త వారిని చేర్చుకుని, వారికి శిక్షణ ఇచ్చినట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు.


పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కేసుపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా పనిచేస్తున్నాయి. ‘20 ఏళ్లయినా చట్టం నుంచి తప్పించుకోలేరనడానికి ఇది నిదర్శనం" అని డీఐజీ అన్నారు. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో ముష్కర మూకల భరతం పడుతోన్న దర్యాప్తు సంస్థలు.. పలు కుట్రలను భగ్నం చేస్తున్నారు.


ఉగ్రవాదుల కుటుంబ సభ్యులకు పేలుడు పదార్థాల గురించి తెలుసా? లేదా? అనే విషయంపై అనుమానాలు ఉన్నాయని డీఐజీ తెలిపారు. వారికి తెలిసే చేశారా లేదా అనేది విచారణలో తెలుస్తుందని ఆయన అన్నారు. సాంకేతిక నైపుణ్యం కలిగిన ఈ ఉగ్రవాదులు రాయచోటిలో స్థిరపడిన తర్వాత.. 2013 బెంగళూరు మల్లేశ్వరంలో జరిగిన పేలుళ్లలో వీరి ప్రమేయం ఉందని ఆయన చెప్పారు. నిందితుల నుంచి పేలుడు పదార్థాలతో పాటు ఫ్యూయల్ ఆయిల్ కలిపిన అమ్మోనియం నైట్రేట్, గన్ పౌడర్‌లు, దేశంలోని మూడు ప్రధాన నగరాలు, రైల్వే నెట్‌వర్క్‌ల మ్యాప్‌లు దొరికాయని ఆయన వివరించారు. అబూబకర్ సిద్ధిఖీ భార్య షేక్ సైరాభాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీమ్‌లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa