ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాలీలో ఇద్దరు తెలుగువారు సహా ముగ్గురు భారతీయులు కిడ్నాప్.. స్పందించిన కేంద్రం

international |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 10:57 PM

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీలో సిమెంట్ ఫ్యాక్టరీపై దాడిచేసిన ఉగ్రవాదులు... అక్కడ పనిచేసే ముగ్గురు భారతీయులను అపహరించిన ఘటన కలకలం రేపుతోంది. పశ్చిమ మాలీలోని కాయెస్ ప్రాంతంలో డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలోకి జులై 1న సాయుధులైన ఉగ్రవాదులు చొరబడి.. భయాందోళనకు గురిచేశారు. తుపాకులతో బెదిరించి ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేశారు. వీరిలో ఇద్దరు తెలుగువారు, ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రమణ, తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన అమరలింగేశ్వర్‌తో పాటు డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్, మహారాష్ట్రకు చెందిన జోషిగా గుర్తించారు. కిడ్నాప్ వ్యవహారంపై మాలీలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధిత కుటుంబాలతో మాట్లాడిన ఎంబసీ అధికారులు.. వారిని వీలైనంత త్వరగా ఉగ్రవాదుల చెర నుంచి విడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ నుంచి ప్రతినిదుల బృందం మాలీకి బయలుదేరి వెళ్లింది.


అంతర్జాతీయంగా నిషేధం ఉన్న ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధం ఉన్న జమాత్‌ నుస్రత్‌ అల్‌ ఇస్లాం వాల్‌ ముస్లిమిన్‌ అనే సంస్థకు చెందిన ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు భారత విదేశాంగశాఖ ధ్రువీకరించింది. బందీలను విడిపించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో చర్చిస్తోంది. అలాగే, పరిశ్రమ యాజమాన్యంతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి.. మాలీలో సిమెంట్ ఫ్యాక్టరీతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఫ్యాక్టరీతో ఆయన ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం.


ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ‘బందీలను సురక్షితంగా, త్వరగా విడుదల చేయడానికి మాలీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరిందిఆ. అలాగే, మాలిలోని భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏదైనా సహాయం కావాలంటే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. కిడ్నాప్‌కు గురైన భారతీయులను వీలైనంత త్వరగా విడిపించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. కాగా, బాధిత కుటుంబాలు తమ వారి భద్రతపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. వారు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారో? ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేస్తోరేమోనని భయపడిపోతున్నారు. వీలైనంత త్వరగా వారి చెర నుంచి విడిపించాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa