గతంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల కుటుంబాలు విమానయాన సంస్థపై తీవ్ర ఆరోపణలు చేశాయి. నష్ట పరిహారం చెల్లించడానికి ముందు తమ ఆర్థిక వివరాలను బలవంతంగా వెల్లడించాలని ఎయిర్ ఇండియా ఒత్తిడి చేస్తోందని.. ఇది తమను తీవ్రంగా అవమాన పరుస్తోందని ఆ కుటుంబాలు వాపోతున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఎయిర్ ఇండియా తీవ్రంగా ఖండించింది. తాము ఈ ప్రక్రియను పారదర్శకంగా, మానవత్వంతో నిర్వహిస్తున్నామని పేర్కొంది.
అహ్మదాబాద్లో జరిగిన ఏఐ-171 విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ల్యాండ్ అయిన కాసేపటికే ఈ విమానం కుప్పకూలగా ఘోర ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా విమానం జనావాసాలపై పడగా.. విమానంలో ఉన్న వారు సహా స్థానిక ప్రజలు సైతం చనిపోయారు. పదలు సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే తాజాగా బాధితుల కుటుంబాలకు న్యాయపరమైన సహాయం అందిస్తున్న యూకేకు చెందిన 'స్టీవర్ట్స్ లా' సంస్థ.. ఎయిర్ ఇండియా తీరును తీవ్రంగా తప్పు పట్టింది. 40 మందికి పైగా బాధితుల కుటుంబాల తరపున వాదిస్తున్న ఈ సంస్థ.. ఎయిర్ ఇండియా "బలవంతం, బెదిరింపులు, ఒత్తిడి"కి పాల్పడుతోందని ఆరోపించింది.
నష్ట పరిహారాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నిలిపివేస్తామని బెదిరించి కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కుటుంబాలు ఫిర్యాదు చేసినట్లు స్టీవర్ట్స్ లా వెల్లడించింది. ఇప్పటికే ప్రియమైన వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఈ విధంగా వేధించడం అమానవీయమని బాధితుల తరపు న్యాయవాదులు పేర్కొంటున్నారు.
మరోవైపు ఎయిర్ ఇండియా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. విమానయాన సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తాము పరిహారం ప్రక్రియను అత్యంత సున్నితంగా, మానవతా దృక్పథంతో నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. అన్ని చట్టపరమైన, నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. బాధిత కుటుంబాలకు పూర్తి మద్దతు ఇస్తున్నామని వెల్లడించింది. ఆర్థిక వివరాలను అడగడం అనేది సాధారణ ప్రక్రియలో భాగమే తప్ప.. బలవంతంగా అడగడం లేదని ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే చాలా మందికి మధ్యంతర నష్ట పరిహారం చెల్లించబడిందని కూడా సంస్థ పేర్కొంది.
విమాన ప్రమాద బాధితులకు నష్ట పరిహారం అనేది ఎల్లప్పుడూ ఒక సున్నితమైన అంశమని చెప్పింది. ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నప్పుడు.. ఆర్థిక వివరాలను వెల్లడించమని అడగడం, దానిపై వివాదం తలెత్తడం అనేది బాధిత కుటుంబాలకు మరింత మానసిక క్షోభను కలిగించే అంశమని పేర్కొంది. ఈ ఆరోపణలు వాటిపై ఎయిర్ ఇండియా ఖండనతో ఈ పరిహారం ప్రక్రియ మరింత వివాదాస్పదంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa