ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. 69 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 10:53 PM

హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల బీభత్సం కొనసాగుతోంది. జూన్ 20వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు కేవలం పదిహేను రోజుల్లోనే కురిసిన భారీ వర్షాలు, మేఘాల విస్ఫోటనం, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల కారణంగా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతవగా.. అనేక మంది గాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 రహదారులు మూసుకుపోగా, రూ.400 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.


ముఖ్యంగా మండి జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ఇళ్లు మొత్తం నేలమట్టం అయ్యాయి. వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. నదులు, వాగులు పొంగిపొర్లడంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. 500కు పైగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు పని చేయకుండా పోయాయి. సుమారు 700 తాగునీటి సరఫరా పథకాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను చేపట్టింది. భారత సైన్యం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది, స్థానిక పోలీసులు, ఇతర కేంద్ర ఏజెన్సీలు గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. రహదారులను పునరుద్ధరించడం, విద్యుత్, తాగునీటి సరఫరాను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం అత్యంత ప్రాధాన్యతగా అధికారులు పెట్టుకున్నారు.


భారత వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్‌కు జులై 7వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వానలతో పాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ విపత్తుకు కారణం ప్రపంచ వాతావరణ మార్పులే అని అధికారులు పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ సున్నితమైన పర్యావరణ వ్యవస్థపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉందని వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించింది. వీలు అయినంత వరకు ఇళ్లల్లోనే ఉండాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక బృందాలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ విపత్తు నుంచి రాష్ట్రం కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa