ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొహరీ ఆకులో భారత ప్రధానికి భోజనం

international |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 10:50 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోకి వెళ్లారు. అక్కడి ప్రధాని కమ్లా ప్రసాద్ బిసెస్సార్ చేసిన ఓ అపూర్వ ఆత్మీయ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పీఎం కమ్లా.. మోదీ స్వయంగా రాసిన ఓ గుజరాతీ కవితను చదివి వినిపించడంతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని, ముఖ్యంగా భారతీయ మూలాల బంధాన్ని మరింత బలోపేతం చేసింది.


పీఎం మోదీ రాసిన 'ఆంఖ్ ఆ ధన్య ఛే' (ఆ కళ్లు ధన్యమైనవి) అనే కవితను ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా ప్రసాద్ బిసెస్సార్ చదివారు. గుజరాతీ భాషలో మోదీ రాసిన పుస్తకంలోని కవితను ఆమె ప్రస్తావించారు. ఈ కవితలో.. కష్ట సమయాల్లో అండగా నిలబడిన వారిని గుర్తుంచుకోవడం, వారి జ్ఞాపకాలు మన ప్రయాణంలో భాగం కావడం వంటి లోతైన భావాలు ఉన్నాయి. దానిని ట్రినిడాడ్ ప్రధాని వినిపించడం అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచింది. ఇక ఈ దేశంలో భారత సంతతికి చెందిన ప్రజలు 40 శాతం మంది ఉన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఇప్పటికీ వారి ఆహారం, సంగీతం, భాషల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.


మోదీ రాసిన ఒక పుస్తకం నుంచి ఈ కవితను పీఎం కమ్లా ఉటంకించారు. ఇది కేవలం ఒక కవితా పఠనం మాత్రమే కాదు, ఇద్దరు దేశాధినేతల మధ్య ఏర్పడిన ఒక ప్రత్యేక అనుబంధానికి, సాంస్కృతిక అవగాహనకు ప్రతీకగా నిలిచింది. ఇది మాత్రమే కాకుండా.. సొహరీ ఆకుపై ఆహారం వడ్డించారు. ఇది ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రజలకు.. ముఖ్యంగా భారతీయ మూలాలు కలిగిన వారికి గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ పండుగలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల సమయంలో తరచుగా ఈ ఆకుపై ఆహారాన్ని వడ్డిస్తారు.


మరోవైపు ట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాలో సుమారు 40 శాతం మంది భారతీయ మూలాలు ఉన్న వారే కావడం గమనార్హం. దాదాపు 5.56 లక్షల మంది భారతీయ మూలాలు ఉన్న ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. పీఎం కమ్లా పెర్సాద్ బిసెస్సార్ స్వయంగా భారతీయ మూలాలు ఉన్న నాయకురాలు. ఆమె పూర్వీకులు బీహార్‌లోని బక్సర్ జిల్లాకు చెందినవారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ప్రధాని మోదీ ఆమెను "బిహార్‌ కుమార్తె"గా అభివర్ణించారు. ఈ సందర్భంగా మోదీ.. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు.


ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను, ప్రజల మధ్య సంబంధాలను మరింత దృఢ పరుస్తాయి. ఒక దేశ ప్రధాని మరొక దేశ ప్రధాని రాసిన కవితను సొంత భాషలో చదవడం అనేది చాలా అరుదైన సంఘటన. ఇది కేవలం దౌత్యపరమైన బంధాలను మాత్రమే కాకుండా.. ప్రజల మధ్య భావోద్వేగ అనుబంధాన్ని కూడా పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య భవిష్యత్తు సహకారానికి కొత్త మార్గాలను తెరుస్తుందని ఆశిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa