ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలకు తల్లికి వందనం రాలేదని టవర్ ఎక్కిన తండ్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 06, 2025, 09:54 PM

తల్లికి వందనం పథకం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం. 2024 ఎన్నికల సమయంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15000 ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన హామీ మేరకు 2025లో నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తోంది. జూన్ 12న తల్లికి వందనం పథకం కింద సీఎం చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేశారు. మొత్తం 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం నగదు జమ చేశారు. ఇక చెప్పిన ప్రకారమే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం వర్తింపజేశారు. అయితే పాఠశాల అభివృద్ధి కోసం రూ.2000 కట్ చేసిన ప్రభుత్వం.. ప్రతి విద్యార్థికి రూ.13000 చొప్పున జమ చేసింది. ఇక అర్హులై ఉండి.. తల్లికి వందనం రాని వారి కోసం మరోసారి దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది కూడా.


ఇంట్లో ఎంతమంది స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం నగదు జమ చేయటంతో ఏపీలోని మధ్య తరగతి కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ఒక్కో ఇంటిలో 5 నుంచి ఆరుగురు విద్యార్థులకు, ఒక్కో చోట ఒకే ఇంట్లోని 12 మందికి కూడా తల్లికి వందనం నిధులు జమైన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తల్లికి వందనం పథకం గురించి చర్చ జరుగుతోంది. అయితే తన పిల్లలకు తల్లికి వందనం పథకం కింద డబ్బులు రాలేదంటూ టవర్ ఎక్కాడో తండ్రి. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది.


భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన కోరుపల్లి శ్యామ్ అనే వ్యక్తి.. తన పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడలేదంటూ.. విద్యుత్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తన పిల్లలకు కూడా తల్లికి వందనం డబ్బులు అందించాలని టవర్ ఎక్కి డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. శ్యామ్‌కు నచ్చజెప్పి కిందకు దించే ప్రయత్నం చేశారు. అయితే ఎంత చెప్పినా మనోడు వింటేగా.. అక్కడే కూర్చుని నిరసన తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.


శ్యామ్ భీష్మించుకుని కూర్చోవటంతో చేసేదేమీ లేక పోలీసులు.. శ్యామ్ భార్య, పిల్లలను ఘటనాస్థలికి తీసుకువచ్చారు. మైక్ సాయంతో శ్యామ్ కూతురి ద్వారా అతన్ని కిందకు దించే ప్రయత్నం చేశారు. తండ్రిని కిందకు దించేందుకు డబ్బులు పడ్డాయ్ కిందకు దిగు డాడీ అంటూ చిన్నారి వేడుకుంది. అయితే భార్యా, పిల్లలు ఎంత చెప్పినా కూడా శ్యామ్ మంకుపట్టు వీడలేదు. పోలీసులు లెటర్ రాసి హామీ ఇస్తానంటేనే దిగుతాను అంటూ భీష్మించుకున్నాడు.


చివరకు పోలీసులు సర్దిచెప్పటంతో ఎట్టకేలకు టవర్ మీద నుంచి కిందకు దిగారు. అయితే శ్యామ్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు రాకపోతే అధికారుల వద్దకు వెళ్లాలి కానీ.. ఇలాంటి పని చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ఏదైనా జరిగితే కుటుంబానికి ఎవరు దిక్కని ప్రశ్నిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa