ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఝార్ఖండ్‌లో రైల్వే ట్రాక్‌పై ఏనుగు ప్రసవం సుమారు రెండు గంటల పాటు నిలిచిపోయిన రైలు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 09, 2025, 08:10 PM

ఝార్ఖండ్‌లో ఒక అరుదైన, హృదయానికి హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ ఏనుగు కోసం ఏకంగా రెండు గంటల పాటు రైలును నిలిపివేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ స్ఫూర్తిదాయక ఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ స్వయంగా పంచుకున్నారు.ఝార్ఖండ్‌లోని ఒక రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన గర్భిణి ఏనుగు ప్రసవ వేదనతో బాధపడుతోంది. అదే సమయంలో అటుగా వస్తున్న రైలును స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమై రైలును ఆపివేశారు. దీంతో లోకో పైలట్ రైలును ట్రాక్‌పైనే నిలిపివేశారు. సుమారు రెండు గంటల నిరీక్షణ తర్వాత ఆ ఏనుగు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తన బిడ్డతో కలిసి నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోయింది. తల్లీబిడ్డ క్షేమంగా వెళ్లేంత వరకు రైలు అక్కడే ఆగి ఉంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. మానవులు, జంతువుల మధ్య ఘర్షణ వార్తలు వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సామరస్యపూర్వక సంఘటనలు ఎంతో సంతోషాన్నిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఏనుగు ప్రసవానికి సహకరించిన వారి సున్నితమైన మనసును, జార్ఖండ్ అటవీ శాఖ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa