జగన్ పర్యటనలను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, కానీ "ముగ్గురు మూర్ఖులు కలిసి జగన్ను ఆపగలరా అని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యరశ్మిని ఆపడం ఎవరివల్లా కాదని, అలాగే జగన్ను కూడా ఎవరూ నిలువరించలేరని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ చిత్తూరు పర్యటన ఖరారవ్వగానే ప్రభుత్వం భయపడిపోయిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. "జగన్ వస్తున్నారని తెలిసి మార్కెట్ యార్డును మూసివేయించారు. పంట కొనే వ్యాపారులను, రైతులను రావొద్దని అడ్డుకున్నారు. ఇది ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం" అని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే, వారి గోడు వినే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు."164 సీట్లు గెలిచామని జబ్బలు చరుచుకుంటున్న కూటమి నేతలు, ప్రజల సొమ్ముతో హెలికాప్టర్లలో తిరుగుతూ సోకులు చేసుకుంటున్నారు. కానీ ధాన్యం, పెసలు, మినుముల రైతులకు గిట్టుబాటు ధర దొరక్క అల్లాడుతుంటే పట్టించుకోవడం లేదు. ఇది రాష్ట్రానికి పట్టిన దరిద్రం" అని నాని విమర్శించారు. మామిడి రైతులను పరామర్శించేందుకు జగన్ వస్తానని చెప్పేంతవరకు ప్రభుత్వానికి స్పృహే లేదని అన్నారు. తాము 3.5 లక్షల టన్నుల మామిడి కొన్నామని, సబ్సిడీ ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ అబద్ధాలని, ఒక్క రైతుకైనా లబ్ధి చేకూరినట్లు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. మీకు నిజంగా చేతనైతే మామిడికి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa