ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కులధ్రువీకరణ పత్రం ఇప్పించండి సారూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 09, 2025, 09:02 PM

ఏపీ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రజాదర్బార్ అంటూ ఇంటి వద్దకు వచ్చే వారి నుంచి వినతులు స్వీకరించి, పరిష్కరిస్తున్న నారా లోకేష్.. ఆన్‌లైన్‌లోనూ అంతే యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. తన శాఖ పరిధిలోకి రాని అంశమైతే.. సదరు మంత్రులకు తెలియజేస్తూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్‌ను వేడుకుంటూ ఓ విద్యార్థి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. తనకు ప్రాణభిక్ష పెట్టాలంటూ వేడుకున్నాడు. అయితే ఆ విద్యార్థి ఎవరు.. అతనికి వచ్చిన కష్టం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి చెందిన బి. నరేష్ అనే విద్యార్థి.. ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. పదో తరగతి పరీక్షల్లో 575 మార్కులు కూడా వచ్చాయంట. తర్వాతి చదువు కోసం ఐఐఐటీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇక్కడే సమస్య వచ్చింది. నరేష్ తాము బెంతు ఒరియా సామాజికవర్గానికి చెందినవారిమని చెప్తున్నారు. అయితే ఎస్టీ కులధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే పలాస ఆర్డీవో ఇవ్వటం లేదనేది నరేష్ ఆరోపణ.


దీంతో హైకోర్టును ఆశ్రయించానని.. ఎస్టీ కులధ్రువీకరణ పత్రం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా కూడా పలాస ఆర్డీవో ఇవ్వడం లేదని చెప్తున్నాడు. ఐఐఐటీ కౌన్సిలింగ్ సమయం వస్తోందని.. తనకు ఎస్టీ కులధ్రువపత్రం ఇచ్చేలా చూడాలని నారా లోకేష్‌ను నరేష్ వేడుకుంటున్నాడు. ఎస్టీ కులధ్రువపత్రం ఇచ్చేలా చూసి.. తనకు ప్రాణభిక్ష పెట్టండి లోకేష్ గారూ అంటూ నరేష్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఓ యూజర్‌ను నారా లోకేష్‌ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.


ఎవరీ బెంతు ఒరియా సామాజికవర్గం.. ఏమిటీ సమస్య?


శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాలలో బెంతు ఒరియా సామాజికవర్గానికి చెందినవారు ఎక్కువగా నివసిస్తున్నారు. అయితే కుల ధ్రువీకరణ పత్రాల్లో వీరిని ఒరియా అనే ఓసీ కులస్థులుగా కొన్నిచోట్ల అధికారులు చూపిస్తున్నారు. అయితే తాము బెంతు ఒరియా కులస్థులమని.. గిరిజనులమని, ఎస్టీల కింద తమను గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని వీరు గత 20 ఏళ్లుగా కోరుతున్నారు. పలుసార్లు ఆందోళనలు కూడా చేపట్టారు. అయితే వీరు గిరిజనులు కాదని.. గిరిజనుల కింద వీరికి ఎస్టీలుగా సర్టిఫికేట్లు ఇస్తే నిజమైన గిరిజనులకు అన్యాయం జరుగుతుందనేది మరికొందరి వాదన.


బెంతు ఒరియాలు ఎక్కడి నుంచి వచ్చారు?


బెంతు ఒరియాలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతమంతా ఒకప్పుడు గంజాం జిల్లాగా ఉండేది. ఈ గంజాం జిల్లా ఒడిశాలో ఉండేది. అయితే ఆ తర్వాతి క్రమంలో బెంతు ఒరియాల పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాలో స్థిరపడిపోయారనేది ఓ వాదన. అలాగే 1973 -1976, 1999-2003 మధ్యకాలంలో ,తమను ఎస్టీలుగా గుర్తిస్తూ కుల ధ్రువీకరణపత్రాలు కూడా ఇచ్చారని.. కానీ 2003 నుంచే సమస్య మొదలైందని వీరి వాదన. తమ పూర్వీకులను గిరిజనులుగా గుర్తించి తమను ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నిస్తున్నారు.


ఈ సమస్యపై వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్ అధికారి జేసీ శర్మ నేతృత్వంలో 2019లో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. 2022లో శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌తో మరో కమిషన్ ఏర్పాటైంది. బెంతు ఒరియాలపై అధ్యయనం చేయాలని ఈ ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.


అయితే అప్పటి నుంచి ఆ సమస్య అలాగే ఉంది. మరోవైపు బెంతు ఒరియాలు ఎస్టీలేనని.. కానీ ఇప్పుడు ఉన్నవారు నిజమైన బెంతు ఒరియాలా, కాదా అనేని గుర్తించాల్సి ఉందనేది మరో వాదన. అలా 20 ఏళ్లకు పైగా పరిష్కారం దొరకని ఓ సమస్య.. ఓ విద్యార్థి చదువుకు ఆటంకంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa