పీ4 కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మార్గదర్శకులతో సమావేశం కానున్నారు. పీ4 – జీరో పావర్టీ కార్యక్రమంపై నిన్న తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పీ4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మార్గదర్శకులుగా ఉండేందుకు 18,332 మంది ముందుకు వచ్చారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు, ఉన్నత వర్గాల వారు ఉన్నారు. వీరి ద్వారా 1,84,134 బంగారు కుటుంబాలకు చేయూత లభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంతో పాటు మార్గదర్శిగా ఉండేవారిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.మార్గదర్శులుగా ఉండేవారిని ప్రోత్సహించడానికి స్వయంగా వారితో చంద్రబాబు సమావేశం కానున్నారు. మార్గదర్శులుగా ఉండే 200 మంది టాప్ ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, భారీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు, సెలబ్రిటీలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ నెల 18వ తేదీన అమరావతిలో వీరిని విందుకు ఆహ్వానించాలనే అంశంపై ఈ సమీక్షలో చర్చ జరిగింది.పీ4 లక్ష్యాలను వివరించి మరింత మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa