ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కొవ్వూరు అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ కొవ్వూరు నియోజకవర్గం గురించి ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం జనసేన ఇంఛార్జి టీవీ రామారావును.. జనసేన పార్టీ ఇంఛార్జి పదవి నుంచి తప్పించడమే ఇందుకు కారణం. టీవీ రామారావును కొవ్వూరు జనసేన ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించిన జనసేన పార్టీ అధిష్టానం.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
టీవీ రామారావు పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు, కార్యక్రమాలను నిర్వహించినట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఎన్డీఏ కూటమి స్పూర్తికి విఘాతం కలిగించేలా టీవీ రామారావు చర్యలు ఉన్నాయని జనసేన అధిష్టానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గ ఇంఛార్జి పదవి నుంచి తక్షణమే తప్పిస్తున్నామని.. తదుపరి నిర్ణయం తీసుకునే వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ జనసేన ప్రకటన విడుదల చేసింది.
జనసేన పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు టీవీ రామారావు ఓ ట్వీట్ చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో జనసేనకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదని.. సొసైటీలు, ఏఎంసీ కమిటీల ఏర్పాటులో పరిగణనలోకి తీసుకోలేదని అందులో పేర్కొన్నారు. జనసేన పార్టీ పొత్తు ధర్మాన్ని నిబద్ధతతో పాటిస్తున్నప్పటికీ., తెలుగుదేశం పార్టీ నుంచి సహకారం లేదంటూ ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గ ఇంఛార్జి పదవి నుంచి టీవీ రామారావును జనసేన పార్టీ తొలగించింది.ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కొవ్వూరులో రాజకీయ రచ్చకు కారణమైంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై కొంతమంది జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తు్న్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి టీవీ రామారావు జనసేనలో చేరారని.. కొవ్వూరులో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేశారని చెప్తున్నారు. అయితే పశ్చిమగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు నుంచి ఆయన సహకారం లేదని.. టీవీ రామారావును పక్కనపెట్టేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గోవిందరావు ద్వారా టీవీ రామారావు జనసేన పార్టీలోకి చేరలేదనే కోపంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ట్వీట్లు చేస్తున్నారు.
2024 ఎన్నికల సమయంలో కొవ్వూరులో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం కోసం టీవీ రామారావు తీవ్రంగా శ్రమించారని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం అనంతరం.. టీవీ రామారావు నామినేటెడ్ పోస్టును ఆశించారని.. కానీ ఆ విషయంలోనూ జనసేన అధిష్టానం ఆయనను పక్కన పెట్టిందని కొంతమంది ఆరోపిస్తున్నారు. సొసైటీ, ఏఎంసీ కమిటీల ఎంపిక విషయంలోనూ టీవీ రామారావును పక్కన బెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కోసం, జనసేన ప్రాతినిధ్యం కోసం పనిచేస్తున్న టీవీ రామారావు లాంటి వ్యక్తిని పక్కనపెట్టడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలపై విచారించి.. నివేదిక ఇవ్వాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కొవ్వూరు వ్యవహారంపై విచారించి.. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ను ఆదేశించారు. మరోవైపు టీవీ రామారావు 2009లో కొవ్వూరు నుంచి టీడీపీ తరుఫున ఎమ్మె్ల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కేఎస్ జవహర్కు మద్దతుగా ప్రచారం చేశారు. 2019లో వైసీపీలో చేరిన ఆయన.. తానేటి వనితకు మద్దతు ఇచ్చారు. అనంతరం 2023లో వైసీపీని వీడి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa