అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారణి రాధిక యాదవ్ను ఆమె తండ్రే అత్యంత కిరాతకంగా తుపాకీతో కాల్చిచంపిన ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కూతురు సంపాదనతో బతుకున్నావంటూ స్థానికులు హేళనగా మాట్లాడటం.. తను వద్దన్నా వినకుండా టెన్నీస్ అకాడమీని కుమార్తె నడపడం అతడు అవమానంగా భావించిన దీపక్ యాదవ్ దారుణానికి ఒడిగట్టాడు. గురుగ్రామ్లోని సుశాంత్ లోక్ ప్రాంతంలోని తమ నివాసంలో రాధిక బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తుండగా.. ఆమెపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు దీపక్. దీంతో తీవ్రంగా గాయపడిన రాధికను కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.
హర్యానాలోని వజీరాబాద్ గ్రామానికి చెందిన దీపక్ యాదవ్కు గురుగ్రామ్లో అనేక రెంటల్ ప్రాపర్టీలు ఉన్నాయని, వీటి అద్దెల ద్వారా నెలకు రూ.15 లక్షల నుంచి 17 లక్షల వరకు ఆదాయం వస్తుందని సమాచారం. అతడికి గురుగ్రామ్లో విలాసవంతమైన ఫామ్ హౌస్ కూడా ఉంది. స్థానికులు మాట్లాడుతూ.. ‘‘ఆయన చాలా ధనవంతుడు.. మంచి మనసున్నవాడు కూడా. తన కుమార్తె టెన్నిస్ కోసం రూ.2 లక్షల విలువైన రాకెట్లు కూడా కొనిచ్చాడు’’ అని వెల్లడించారు.
హత్యకు దీపక్ వినియోగించిన .32 బోర్ లైసెన్స్ గన్ సాధారణంగా సామాన్యులందరికీ లభ్యం కాదు. దీని కోసం పలుకుబడి, డబ్బు అవసరం అవుతాయి. ఈ అంశంపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. రాధిక ఇంట్లోనే టెన్నిస్ అకాడమీ నడుపుతోంది. కానీ ఇది దీపక్కు ఇష్టం లేదని పోలీసులు చెబుతున్నారు. కుమార్తె స్వతంత్రంగా బతకడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్, మ్యూజిక్ వీడియోలలో కనిపించడం వల్ల కుటుంబం పరువు పోతుందని దీపక్ భావించాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
‘ఆయనకు అంత ఆదాయం వనరులు ఉంటే.. ఎవరు ఆయనను కూతురి సంపాదనపై ఆధారపడి ఉన్నాడని చెబుతారు? అది అతడికి అంత ముఖ్యం కాదు’ అని ఆ కుటుంబానికి సన్నిహితుడు ఒకరు చెప్పాడు. రెండు అంతస్తుల భవనంలోని మొదటి ఫ్లోర్లో రాధిక, ఆమె తల్లిదండ్రులతో నివసిస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఆమె మామ కొలీదీప్ యాదవ్ కుటుంబంతో ఉన్నారు. కాల్పుల శబ్దం విన్న కొలీదీప్, పైకి పరుగెత్తుకొచ్చి చూసేసరికి రాధిక కిచెన్లో రక్తపు మడుగులో పడి ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెన్నిస్లో ఎదగాలన్న కుమార్తెను కలను నిజం చేసిన తండ్రే.. ఆమె పాలిట యముడయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa