ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదల్లో కొట్టుకుపోయిన రెండు కుటుంబాలు.. 150 కిలో మీటర్ల దూరంలో మృతదేహాలు

national |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 09:03 PM

హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. ఆకస్మికంగా వస్తున్న ఈ వరదల వల్ల అనేక ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. అంతేకాకుండా చాలా మంది వీటి ధాటికి నీళ్లలో కొట్టుకుపోయి ప్రామాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడి ప్రతాపానికి జనజీవనం స్తంభించిపోగా.. మాండి జిల్లాలోని పాంగ్లుయెడ్ గ్రామంలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. పది రోజుల క్రితం రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో నలుగురి మృతదేహాలు 150 కిలోమీటర్ల దూరంలోని జ్వాలాపూర్‌లో లభ్యం అయ్యాయి. నిదర్శనం. మిగిలిన ఐదుగురి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.


జూన్ 20వ తేదీన ప్రారంభమైన రుతుపవనాల ప్రభావం జులై 6వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేసింది. ఈ కాలంలో సుమారు 23 ఆకస్మిక వరదలు, 19 మేఘ విస్ఫోటనాలు , 16 కొండచరియలు విరిగిపడిన సంఘటనలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వర్షాల సంబంధిత ఘటనల్లో మృతుల సంఖ్య 91కి చేరింది. ఇంకా 34 మంది గల్లంతవగా, 130 మంది గాయపడినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. జులై 16వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది. ముఖ్యంగా కాంగ్రా, సిర్మౌర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు కురుస్తాయని, దీనికి 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. అలాగే జూలై 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 'ఎల్లో అలర్ట్' ప్రకటించారు. ఇది సహాయక చర్యలకు ఆటంకం కలిగించడమే కాకుండా.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.


వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు గల్లంతైన వారి కోసం అన్వేషణను కొనసాగిస్తున్నాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కొండచరియలు విరిగిపడటం వంటివి సహాయక బృందాలకు సవాళ్లను విసురుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తు నుండి కోలుకోవడానికి రాష్ట్రానికి సమయం పడుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రభుత్వం జారీ చేసే సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa