నేటి కృత్రిమ మేధస్సు ఆధిపత్య ప్రపంచంలో.. కంపెనీలను నిర్మించి, నూతన ఆవిష్కరణలు చేయాలనుకునే విద్యార్థులు ఏ సబ్జెక్టుపై దృష్టి పెట్టాలి? ఈ ప్రశ్న విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లోనూ అనేక సార్లు మెదిలే ఉంటుంది. దీని గురించి అనేక మందిని అడిగే ఉంటారు. వారు ఏదో ఒక సమాధానం తెలిపే ఉంటారు కూడా. కానీ ఆ సమాధానంతో సంతృప్తి చెందక.. లైఫ్లో బాగా సక్సెస్ అయి పెద్ద పెద్ద కంపెనీలను నడుపుతున్న వారు దీనికి సమాధానం చెబితే బాగుంటుందని కూడా భావించే ఉండుంటారు. అలాంటి వారికోసమే అన్నట్లుగా ఈ కీలక ప్రశ్నకు సంబంధించి టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్లు సమాధానం చెప్పారు. మరి వారేమన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందామా..?
టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్.. వ్యవస్థాపకత్వం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కు గణితం అత్యుత్తమ సబ్జెక్టు అని గట్టిగా తెలిపారు. గణితం ద్వారా తార్కిక ఆలోచన, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు (problem-solving skills), సంక్లిష్ట సమస్యలను విశ్లేషించి చిన్న భాగాలుగా విభజించే సామర్థ్యం పెంపొందుతాయని వెల్లడించారు. ఇవి కొత్తగా కంపెనీలను నిర్మించడానికి, నిర్వహించడానికి అవసరమైన ప్రధాన నైపుణ్యాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించి పోస్టు కూడా పెట్టారు. అయితే తాజాగా దీనిపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు.
ముఖ్యంగా గణితంతో పాటు మరో సబ్జెక్టు కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు భౌతిక శాస్త్రం (Physics) పై దృష్టి పెట్టడం ఉత్తమం అని తన మనసులోని మాటను చెప్పారు. అయితే దీనికి గణితంలో బలమైన పునాది తప్పనిసరి అని.. అంటే ఫిజిక్స్(లెక్కలతో కూడిన) సబ్జెక్టు చాలా ఉపయోగ పడుతుందని కామెంట్ రూపంలో వెల్లడించారు. అయితే దీనికి పావెల్ కూడా సానుకూలంగా స్పందించారు. ప్లస్ వన్ అని రాసి మరీ.. మీరు ఇప్పటికే లెక్కల్లో చురుకుగా ఉంటే ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని వెల్లడించారు. వాత్సవిక ప్రపంచంలో లెక్కలను అన్వయించడానికి ఆ రెండూ అద్భుతమైనవని వెల్లడించారు.
ముఖ్యంగా మీ తార్కిక, సంక్లిష్ట ఆలోచనా విధానాలకు ఇవి చాలా బాగా పదును పెడతాయని పావెల్ దురోవ్ పేర్కొన్నారు. ఇలాగే కీలక సమస్యలను పరిష్కరించడంలో కూడా ముందుంటాయని వివరించారు. పావెల్ చేసిన పోస్టుతో పాటు ఎలన్ మస్క్ రిప్లైలతో ఈ పోస్టు నెట్టింట వైరల్ అయింది. అనేక మంది నెటిజెన్లు.. ఈ పోస్టును లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తూ.. అప్పడప్పుడూ విద్యార్థులకు ఇలాంటి సూచనలు ఇవ్వండంటూ కోరుతున్నారు.
ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ.. పావెల్ దురోవ్, ఎలాన్ మస్క్ ఇద్దరూ బలమైన ఆలోచనా నైపుణ్యాల ప్రాముఖ్యతను అంగీకరించారు. గణితం ఈ నైపుణ్యాలకు ప్రాథమిక ఆధారాంగా పని చేస్తుందని వారు భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా ఈ చర్చలో పాలుపంచుకుంటూ.. ప్రోగ్రామింగ్లో అవసరమైన లోతైన ఆలోచన వంటి కొన్ని మానవ నైపుణ్యాలు ఎల్లప్పుడూ విలువైనవిగా ఉంటాయని, ఏఐ వాటిని పూర్తిగా భర్తీ చేయలేదని పేర్కొన్నారు. ఈ నిపుణుల అభిప్రాయాలు విద్యార్థులకు వారి విద్యా మార్గాలను ఎంచుకోవడంలో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa