ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి కేవలం సామాజిక ఒప్పందం కాదు.. ఆధ్యాత్మిక కలయిక... బాంబే హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 09:40 PM

చిన్న చిన్న మనస్పర్దలతో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వివాహాలు ప్రస్తుతం ప్రమాదంలో పడ్డాయని ఓ విడాకులకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి, అతడి కుటుంబసభ్యులపై భార్య పెట్టిన వరకట్న వేధింపుల కేసును రద్దు చేస్తూ.. హిందూ వివాహ వ్యవస్థపై సమకాలీన సమాజంలో ఆందోళనకర అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. వైవాహిక బంధంలో విబేధాలు తిరిగి కలుసుకోలేనంతగా మారిపోతే... సంబంధిత పార్టీలు జీవితాలను నాశనం చేసుకోకుండా వెంటనే వెంటనే ముగించాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జులై 8 నాటి ఉత్తర్వులో జస్టిస్‌ నితిన్ సాంబ్రే, జస్టిస్ ఎంఎం నెర్లికర్‌లతో కూడిన నాగ్‌పూర్ ధర్మాసనం పేర్కొంది.


వివరాల్లోకి వెళ్తే.. డిసెంబర్ 2023లో ఒక వ్యక్తి, అతడి కుటుంబంంపై ఓ వివాహిత వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో ఆ కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. వరకట్న వేధింపుల కేసును రద్దు చేస్తూ హిందూ వివాహాల పవిత్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో భర్త, భార్య పరస్పర విడాకులు తీసుకున్నట్లు, కేసు రద్దుపై అభ్యంతరం లేదని ఆ మహిళ కోర్టుకు తెలియజేశారు. దీంతో ధర్మాసనం కేసును రద్దుచేసింది. కాగా, విడాకుల కేసులో ఫోన్ రికార్డింగులను సుప్రీంకోర్టు సాక్ష్యాలుగా పరిగణించాలని ఆదేశించింది.


‘‘వివాహ సంబంధాలు, ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో పవిత్రమైనవిగా పరిగణింపబడతాయి. ఇవి నేడు చిన్న చిన్న విభేదాలతో విచ్ఛిన్నమవుతున్నాయి. "ఒకప్పుడు ఆధ్యాత్మికంగా రెండు ప్రాణాల మధ్య బంధంగా ఉన్న వివాహం, ఇప్పుడు సామాజిక ఒప్పందం లాంటిదిగా మారిపోతుంది... దంపతుల మధ్య సమస్యలు పరిష్కరించుకునే ఆసక్తి ఉంటే, కోర్టులు అందుకు ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిగి ఉంటాయి... వైవాహిక బంధంలో విభేదాలు సామాజిక ముప్పుగా మారాయి. చిన్న విషయాలే రెండు జీవితాలను నాశనం చేస్తున్నాయి’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.


వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక సంబంధాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ చట్టం అనేక చట్టాలను రూపొందించిందని, అయితే కొందరు వాటిని తరచుగా దుర్వినియోగం చేస్తున్నారని, ఫలితంగా మానసిక, శారీరక వేధింపులు, అంతులేని సంఘర్షణలు, ఆర్థిక నష్టం,కుటుంబ సభ్యులు, పిల్లలకు కోలుకోలేని హాని జరుగుతుందని కోర్టు పేర్కొంది. ఇటీవల కాలంలో దేశంలో 498 ఏ ను దుర్వినియోగం చేసిన ఘటనలు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని పలువురు భర్త, అతడి కుటుంబసభ్యులపై వేదింపులకు పాల్పడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa