టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపిక అంశం భారత్-చైనాల మధ్య దౌత్య సంబంధాలలో ఓ సమస్యగా మారిందని భారత్లోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. దలైలామా వారసుడి ఎంపికపై భారత దేశంలో కొందరు వ్యక్తులు "అనుచిత వ్యాఖ్యలు" చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి చర్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, సమస్యలకు దారి తీస్తాయని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. భారత విదేశాంగ నిపుణులు టిబెట్కు సంబంధించిన సమస్యల సున్నితత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. దలైలామా వారసత్వం, పునర్జన్మ విషయంలో చైనా అంతర్గత వ్యవహారం అని.. ఇందులో భారత్ కల్పించుకోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
2020లో గాల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణ తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాలో తొలి సారిగా పర్యటించడానికి సిద్ధం అవుతున్న తరుణంలో ఈ దలైలామా వారసుడి అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా బీజింగ్లో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యితో జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని ఇటీవలే ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సున్నితమైన అంశంపై చైనా హెచ్చరికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే సరిహద్దు వివాదాలతో ఉద్రిక్తంగా ఉన్న భారత్-చైనా సంబంధాలు .. దలైలామా వారసుడి అంశంతో మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.
చైనా చేసిన ఈ హెచ్చరికలు.. భారత్ తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని సహించబోమని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. దలైలామా నాయకత్వ ఎంపిక విషయంలో టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం చైనాతో పాటు ఇతర దేశాలకు కూడా జోక్యం చేసుకునే హక్కు ఉందని కొందరు భావిస్తుండగా.. చైనా మాత్రం దీనిని తమ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశంగా చూస్తోంది.
దాదాపు ఆరు దశాబ్దాలుగా టిబెట్ నియంత్రణపై చైనాతో టిబెట్ బౌద్ధ గురువు దలైలామాకు వివాదం నడుస్తోంది. ఈక్రమంలోనే ఆయన ఇటీవలే మాట్లాడుతూ.. చైనా బయటే తన వారసుడు జన్మిస్తాడని పేర్కొన్నారు. అది కూడా భారత్లో కావొచ్చని వ్యాఖ్యానించారు. అలాగే తన వారసత్వంపై నిర్ణయం తీసుకునే అధికారం చైనాకు లేదని స్పష్టం చేశారు. అనంతరం దలైలామా వారసుడి ఎంపికకు కచ్చితంగా తమ ఆమోద ముద్ర కావాలంటూ చైనా డిమాండ్ చేసింది. మరోవైపు దలైలామా పుట్టిన రోజు సందర్భంగా భారత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉందని.. ఇంకెవరికీ అధికారం లేదని చెప్పారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa