ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనుమానాస్పద మద్యం బ్రాండ్ల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఏపీ అబ్కారీ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్కారీ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తెచ్చిన నూతన మద్యం విధానాన్ని పారదర్శకంగా, పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అనుమానాస్పదంగా ఉన్న బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేయాలని సీఎం ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లు, క్వాలిటీ కలిగిన లిక్కర్ బ్రాండ్లు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. నాటుసారా, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయాలు ఎట్టిపరిస్థితులలోనూ జరగడానికి వీల్లేదని చంద్రబాబు అబ్యారీశాఖ అధికారులకు స్పష్టం చేశారు.
మరోవైపు 2024 అక్టోబర్ నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో.. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించేది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఎక్సైజ్ పాలసీని రద్దు చేశారు. దీని స్థానంలో కొత్త లిక్కర్ పాలసీ తెచ్చారు. మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో నూతన మద్యం విధానం వలన నాణ్యమైన మద్యం అందుబాటులోకి వచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగిన విషయాన్ని అబ్కారీ శాఖ సమీక్ష సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. కొత్త మద్యం విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత మద్యం ధరలు గతంతో పోలిస్తే తగ్గాయని అధికారులు చంద్రబాబుకు వివరించారు.
అప్పటితో పోలిస్తే రూ.10 నుంచి రూ. 100 వరకు ఏపీలో లిక్కర్ ధరలు తగ్గినట్టు అబ్కారీ శాఖ అధికారులు చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో మద్యం తాగేవారిపై భారం తగ్గుతోందని చంద్రబాబుకు వివరించారు. ప్రతి నెలా రూ.116 కోట్ల మేర భారం తగ్గుతుందని వెల్లడించారు. అలాగే పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో విక్రయిస్తున్న 30 మద్యం బ్రాండ్ల ధరలు తక్కువగా ఉన్నట్లు చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
మరోవైపు అబ్కారీ శాఖపై సమీక్ష సందర్భంగా ఏపీలో పర్మిట్ రూమ్లను అనుమతించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పర్మిట్ రూమ్లను అనుమతించే అంశం మీద కమిటీతో అధ్యయనం జరపాలని..కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్లను అనుమతించడం ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరటంతో పాటుగా.. రోడ్డుపై నిలబడి మద్యం తాగే పరిస్థితి ఉండదని ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa