ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీకి గిఫ్ట్‌గా మామిడి పండ్లు పంపించిన బంగ్లాదేశ్.. మళ్లీ స్నేహం చిగురిస్తోందా..?

national |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 08:01 PM

ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ నుంచి మామిడి పండ్లు బహుమతిగా వచ్చాయి. మామూలుగా అయితే, ఈ వార్తకు పెద్ద ప్రాధాన్యం లేదు. కానీ, బంగ్లాదేశ్‌తో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇది పెద్ద వార్తే. చైనాతో కలిసి భారత్‌తో ఒకవైపు కయ్యానికి కాలు దువ్వుతున్న మహమ్మద్ యూనస్ .. మరోవైపు మామిడి పండ్ల దౌత్యానికి బాటలు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తన తప్పు తెలుసుకుందా? తీరు మార్చుకుంటోందా? భారత్‌తో సత్సంబంధాల కోసం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించిందా..? వివరాలు..


బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు, రాజకీయ పరిణామాల అనంతరం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య గతంలో ఎన్నడూ లేని విధంగా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. యూనస్ వైఖరే దీనికి ప్రధాన కారణం. ఆయన ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, మరీ ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. హిందువుల ఆస్తులు, ఆలయాలను ధ్వంసం చేశారు. భారత్‌కు ప్రత్యర్థులుగా ఉన్న పాకిస్తాన్, చైనాలకు బంగ్లాదేశ్ మద్దతు పలికింది. దీంతో భారత్‌తో సంబంధాలు చెడాయి.


  భారత్‌కు వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్న మహమ్మద్ యూనస్.. చైనా పర్యటనకు వెళ్లి చికెన్స్ నెక్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. దీనికి భారత్ కూడా పరోక్షంగా ఘాటుగానే బదులిచ్చింది. బంగ్లాదేశ్.. నేపాల్ వెళ్లే దారులను మూసేసింది. భారత్ ప్రధాన్యాన్ని తెలిసొచ్చేలా చేసింది. ఇప్పుడు మామిడి పండ్ల దౌత్యానికి తెరలేపారు యూనస్. గతంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ దేశం నుంచి ప్రధానమంత్రికి మామిడి పండ్లు పంపించే సంప్రదాయం ఉండేది. ఇప్పుడు మోదీకి మామిడిపండ్లు పంపించిన యూనస్.. దౌత్య చర్చలకు సిద్ధమైనట్లుగా సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


మామిడి పండ్లతో బంగ్లాదేశ్ దౌత్యం!


మామిడి దౌత్యం అనేది ఆసియాలో ఎప్పటినుంచో ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. భారత్ బంగ్లాదేశ్‌ మధ్య ఈ సంప్రదాయాన్ని గతంలో షేక్ హసీనా ప్రారంభించారు. అయితే, ఇప్పటివరకు భారత్‌ అంటే వ్యతిరేక వైఖరి ఉన్న మహ్మద్ యూనస్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి వెయ్యి కిలోల 'హరిభంగా మామిడి పండ్ల'ను బహుమతిగా పంపించారు. బంగ్లాదేశ్‌లోని ఉత్తర ప్రాంతంలో పండించే అత్యంత విలువైన హరిభంగా మామిడి పండ్లను.. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)కు.. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పంపించారు. వీటిని కేవలం ప్రధానికి మాత్రమే కాకుండా బంగ్లాదేశ్‌తో సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, మాణిక్ సాహాలకు కూడా పంపిచినట్లు తెలుస్తోంది.


యూనస్‌కు మోదీ శుభాకాంక్షలు


సాధారణంగా పండుగల సందర్భంగా రెండు దేశాల నాయకుల శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒక సంప్రదాయం. అయితే గత నెలలో ఈద్-ఉల్-అధా సందర్భంగా ప్రధాని మోదీ మహ్మద్ యూనస్‌కు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి ప్రతిగా జూన్ 6వ తేదీన లేఖ రాసిన యూనస్.. పరస్పర గౌరవం, అవగాహన స్ఫూర్తితో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. దౌత్యపరమైన చర్చలకు ఒక ప్రయత్నమని విశ్లేషకులు భావిస్తున్నారు.


బంగ్లాపై చైనా ప్రభావం-భారత్‌కు సవాళ్లు


షేక్ హసీనా గద్దె దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ విదేశాంగ విధానం పూర్తిగా మారిపోయింది. చిరకాల మిత్రుడిగా ఉన్న భారత్‌ను కాదని.. చిరకాల శత్రువైన పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ దగ్గరవుతోంది. గతంలో ఎప్పుడూ లేని ఒప్పందాలను పాకిస్తాన్‌తో జరుపుకుంటోంది. అదే సమయంలో చైనాతోనూ సన్నిహిత సంబంధాలను పెంచుకుంటోంది.


గత ఏడాది చైనాతో తన వాణిజ్య సంబంధాలను గణనీయంగా పెంచుకుంది. 7 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు, 6 బిలియన్ డాలర్లకు పైగా రుణ భారంతో.. బంగ్లాదేశ్ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలల ప్రాజెక్ట్ అయిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో కూడా బంగ్లాదేశ్ భాగస్వామి కావడం గమనార్హం.


అదే సమయంలో చైనా మార్కెట్‌లో 97 శాతం బంగ్లాదేశీ వస్తువులను ట్యాక్స్ లేకుండా అనుమతిస్తోంది. దక్షిణాసియాలో అత్యధిక సంఖ్యలో చైనా మద్దతు గల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను బంగ్లాదేశ్ నిర్వహిస్తోంది. అంతేకాకుండా చైనా సైనిక పరికరాలకు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కొనుగోలుదారుగా బంగ్లాదేశ్ నిలిచింది. బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునే ఆయుధాల్లో 70 శాతానికి పైగా చైనా నుంచే వస్తాయి. తీస్తా నది డెవలప్‌మెట్ వంటి కీలక ప్రాజెక్టుల్లో చైనా కూడా జోక్యం చేసుకోవడం.. భారత్‌కు పెను సవాలుగా మారుతోంది.


బంగ్లాదేశ్‌కు భారత్ అవసరం ఎందుకు?


చైనాతో సంబంధాలను భారీగా పెంచుకుంటున్నప్పటికీ.. బంగ్లాదేశ్ భౌగోళికంగా, ఆర్థికంగా భారత్‌తో ఎక్కువ ఆధారపడి, అనుసంధానించబడి ఉంది. బంగ్లాదేశ్‌కు ఉన్న 4,367 కిలోమీటర్ల సరిహద్దులో దాదాపు 94 శాతం భారత్‌తోనే పంచుకుంటుంది. దీనివల్ల రవాణా పరంగా భారత్‌పై ఆధారపడటమే కాకుండా.. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలకు కీలకమైన కారిడార్‌గా ఢాకాకు అధిక ప్రభావం కలిగి ఉంది. వరి, గోధుమ, ఉల్లి, చక్కెర వంటి నిత్యావసర వస్తువులతో పాటు.. పత్తి, ఇనుము వంటి ముడిసరుకుల వరకు.. బంగ్లాదేశ్ భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. శుద్ధి చేసిన పెట్రోలియం, ఎలక్ట్రానిక్ పరికరాలు, నిర్మాణ సామగ్రిని కూడా బంగ్లాదేశ్‌కు.. భారత్ సరఫరా చేస్తోంది.


భారత్‌తో సంబంధాలు దీర్ఘకాలం చెడిపోతే.. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను గట్టి దెబ్బ పడుతుంది. సరిహద్దు వాణిజ్యం తగ్గడం లేదా సప్లై చైన్‌లో ఆలస్యం కావడం వల్ల.. ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం, నిరుద్యోగం, జీడీపీ తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. బంగ్లాదేశ్‌లోని రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమ, దాని ఎగుమతి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉంటుంది. అది ఎక్కువగా భారతీయ వస్త్ర ఉత్పత్తులపై ఆధారపడి ఉంది. రెండు దేశాల ఉద్రిక్తతల కారణంగా.. ఈ పరిశ్రమపై ఏదైనా ప్రభావం పడితే.. విదేశీ ఆదాయం పడిపోవడమే కాకుండా.. ఉపాధిని దెబ్బతీస్తాయి.


నూతన యూనస్ ప్రభుత్వం పట్ల భారతదేశం అసౌకర్యాన్ని స్పష్టం చేసింది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న మతపరమైన హింసను అదుపు చేయడంలో విఫలం కావడం, అలాగే చైనా, పాకిస్థాన్‌ల వైపు దౌత్యపరమైన మొగ్గు చూపడం వంటి అనేక సమస్యలపై ఢాకాలోని యూనస్ పరిపాలన న్యూఢిల్లీ నుంచి విమర్శలను ఎదుర్కొంది. బంగ్లాదేశ్ కూడా, తన వంతుగా, భారతదేశం తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఆరోపించింది, దీన్ని "అవాంఛనీయ భారత జోక్యం" అని అభివర్ణించింది.


బంగ్లాదేశ్ జైళ్ల నుంచి 700 మంది కరుడుగట్టిన నేరగాళ్లు పరార్.. ఎక్కడికి వెళ్లారు?


భారత్‌తో బంగ్లాదేశ్‌కు ఎక్కడ చెడింది?


గతేడాది బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల తర్వాత షేక్ హసీనా పారిపోయిన సంగతి తెలిసిందే. మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, వాళ్ల ఇళ్లు, ఆస్తులు, వ్యాపారాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై హింసాత్మక దాడులు బాగా పెరిగిపోయాయి. పలువురిని హత్య చేయడం తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ఉంచింది. అదే సమయంలో షేక్ హసీనా భారత్‌లో ఉండటం.. ఆమెను అప్పగించాలని ఎన్నిసార్లు బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసినా కేంద్రం అప్పగించకపోవడం ఆ దేశానికి ఆగ్రహాన్ని తెప్పించింది. వీటన్నింటికీ తోడు పాకిస్తాన్ నుంచి వేరుపడటానికి సహాయం చేసిన భారత్‌తో స్నేహాన్ని దూరం చేసుకున్న బంగ్లాదేశ్.. పాకిస్తాన్ వైపు మొగ్గుచూపడం గమనార్హం. దీనికితోడు చైనాకు మద్దతుగా యూనస్ నిలుస్తూ.. భారత వ్యతిరేక వైఖరిని మరింత ఎక్కువ చేసినట్లయింది.


తీస్తా నది జలాల పంపిణీ:


తీస్తా నది జలాల పంపిణీపై భారత్, బంగ్లాదేశ్ మధ్య దశాబ్దాలుగా ఉన్న వివాదం ఇప్పటికీ ఒక పరిష్కారం దొరకలేదు. 2011లో ప్రతిపాదించిన ఒప్పందం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరాల కారణంగా ఆగిపోయింది.


సరిహద్దుల్లో హత్యలు:


భారత సరిహద్దుల్లోని బీఎస్ఎఫ్ దళాల చేతిలో బంగ్లాదేశీయుల చనిపోతుండటంతో.. ఢాకాలో తరచూ తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతోంది. హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం.. 2001 నుంచి 2011 మధ్య 10 ఏళ్లలో దాదాపు వెయ్యిమంది బంగ్లాదేశీయులు బీఎస్ఎఫ్ కాల్పుల్లో మరణించారు. అక్రమ వలసలు, సరిహద్దు నేరాలను అరికట్టడానికి ఈ చర్యలు అవసరమని భారత్ చెబుతోంది.


అక్రమ వలసలు:


బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమ వలసలు పెరగడం తీవ్ర సమస్యగా మారింది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై జనాభా, సామాజిక ఒత్తిడిని సృష్టిస్తున్నాయి.


తీవ్రవాదం:


బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే టెర్రరిస్ట్ గ్రూపులు దాడులకు పాల్పడ్డాయని భారత్ ఆరోపిస్తోంది. అదే సమయంలో ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు కలిసి రావాలని బంగ్లాకు భారత్ పిలుపునిచ్చింది.


మామిడి దౌత్యం ద్వారా.. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. భారత్‌తో దౌత్య సంబంధాలను మళ్లీ ముందున్న స్థాయికి తీసుకువెళ్లాలని అనుకోవడం ఒక సానుకూల సంకేతం అయినప్పటికీ.. అది ఎంతవరకు సఫలం అవుతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు.. బంగ్లాదేశ్‌పై పెరుగుతున్న చైనా ప్రభావం, దశాబ్దాల తరబడి పరిష్కారం లేని తీస్తా నది జలాల పంపిణీ వంటి సమస్యలు భారత్, బంగ్లాదేశ్ సంబంధాలకు పెను సవాళ్లుగా మారాయి. ఈ సవాళ్లను అధిగమించి.. రెండు దేశాలు సహకారాన్ని కొనసాగించడం ప్రాంతీయ స్థిరత్వానికి, ఆర్థిక వృద్ధికి చాలా కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa