భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో దోషిగా నిర్దారణ అయిన కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో జులై 16న (బుధవారం) ఉరిశిక్షను అమలుచేయడానికి యెమెన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, నిమిషను రక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయగా.. సోమవారం (జులై 15న) దీనిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. బ్లడ్ మనీ ఒక్కటే మార్గమని స్పష్టం చేసింది. ఈ కేసు అత్యంత సంక్లిష్టమైందని.. దౌత్యపరంగా పలు సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపింది.
అయితే, నిమిషను రక్షించేందుకు తీసుకున్న చర్యల గురించి వివరణాత్మక అఫిడ్విట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్రం తన వంతు ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. మరోవైపు, ఓ సూఫీ నేత మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయన బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్లు ఇంకా బ్లడ్ మనీకి లేదా క్షమాభిక్షకు వారు అంగీకరించలేదని సమాచారం.
ప్రస్తుతం సనా జైలులో ఖైదీగా ఉన్న నిమిషను ఉరి శిక్ష నుంచి తప్పించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు, చర్చలు కొనసాగుతున్నాయి. యెమెన్తో భారత్కు నేరుగా దౌత్య సంబంధాలు లేకపోవడం, యెమెన్ను అధికారికంగా గుర్తించకపోవడం వల్ల నేరుగా జోక్యం చేసుకునే అవకాశాలు లేకుండా పోయాయి. అయినప్పటికీ భారత ప్రభుత్వం ఉరి శిక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థనను యెమెన్ ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రముఖ మతపెద్దను రంగంలోకి దింపింది. నిమిషను కాపాడేందుకు ఆమె కుటుంబం కూడా విశ్వప్రయత్నాలు చేస్తోంది. పలు దఫాలుగా వారు యెమెన్కు వెళ్లి.. అక్కడ అధికారులను కలిశారు.
యెమెన్లోని షరియత్ చట్టాల ప్రకారం, బాధిత కుటుంబం నేరస్థుడికి షరతులతో కూడిన క్షమాభిక్ష లేదా బ్లడ్ మనీ రూపంలో నగదు తీసుకుని కేసును వాపసు తీసుకునే హక్కు వారికి ఉంటుంది. ఇదే సమయంలో కేరళకు చెందిన ‘రహీమ్ ట్రస్ట్’ ఇప్పటికే రూ.11 కోట్లు బ్లడ్ మనీ ఇవ్వడానికి ప్రతిపాదన చేసింది. సూఫీ నేత అబూబాకర్ ముస్లియార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఆయన ప్రతినిధులు మహద్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా అతడి సోదరుడితో చర్చలు జరుపుతున్నారు. బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి చర్చలకు ముందుకు రావడం సానుకూల పరిణామం. అయితే, ఈ కేసులో ప్రాంతీయ, రాజకీయ, మతపరిమైన అంశాలు, బాధిత కుటుంబం సమ్మతి వంటి కీలక పాత్ర పోషిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa