పూరి జగన్నాథుడి రథయాత్రకు మన దేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో జరిగే ఈ రథయాత్రలో పాల్గొనడం కోసం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఏడాది జూన్ 27న రథయాత్ర ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి భక్తులు రథయాత్రలో పాల్గొనడం కోసం తరలి వచ్చారు. అయితే ఈసారి రథయాత్రలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా కెనడాలోని టొరంటోలో నిర్వహించిన జగన్నాథుడి రథయాత్రపై దాడి చేశారు. కోడిగుడ్లు విసరడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..
కెనడాలోని టొరంటోలో నిర్వహించిన జగన్నాథుని రథయాత్రపై దాడి జరిగింది. రథయాత్రలో పాల్గొన్న భక్తులపైకి కోడి గుడ్లు విసిరారు కొందరు దుండగులు. ఓ బిల్డింగ్ మీదకు ఎక్కి భక్తుల మీద గుడ్లు విసిరారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ఇది అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సున్నితమైన అంశంపై జోక్యం చేసుకోవాలని బీజేడీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖని కోరడంతో.. ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై స్పందిస్తూ.. టొరంటోలో జగన్నాథుడి రథయాత్ర ఊరేగింపు సమయంలో కొందరు ఆకతాయిలు అల్లర్లు సృష్టించినట్లు నివేదికలు వచ్చాయి. ఇటువంటి నీచమైన చర్యలు విచారకరం. ఇలాంటి చర్యలు.. ప్రజల మధ్య ఐక్యత, అందరిని కలుపుకుపోవడం, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించే పండుగ స్ఫూర్తికి విరుద్ధం.ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజల మతపరమైన హక్కులను పరిరక్షించడానికి కెనడియన్ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాము అని తెలిపారు.
ఈ సంఘటన గురించి ముందుగా ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఎక్స్లో పోస్ట్ చేశారు. టొరంటోలో నిర్వహించిన జగన్నాథుడి రథయాత్రపై దాడి చేశారని తెలిపారు. ఇటువంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్నాథ భక్తులను తీవ్రంగా కలచివేస్తాయి. ఇలాంటి ఘటనలు.. ఈ పండుగకు అపారమైన భావోద్వేగ, సంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ఒడిశా ప్రజలకు తీవ్ర వేదనను కలిగిస్తాయి. ఈ నివేదికలు నిజమైతే, ఒడిశా ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరాలి అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. టొరంటోకు చెందిన ఓ భారతీయ మహిళ పగిలిన గుడ్లు ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది నవీన్ పట్నాయక్ దృష్టికి వచ్చింది. ఆయన పోస్ట్ వల్ల విదేశీ మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa