ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క సెకెనులో ఇంజిన్ ఆగిపోతుందా? విదేశీ మీడియా నివేదికలపై విమర్శలు

national |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 04:53 PM

గత నెల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం ఘటనకు సంబంధించి విదేశీ మీడియా చేస్తోన్న ఆరోపణలపై విమానయాన నిపుణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. జూన్ 12న జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు సహా కనీసం 270 మంది మరణించారు. ఇటీవల విడుదలైన ఎయిర్‌క్రాఫ్ట్స్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ప్రకారం.. ప్రమాదానికి ముందు కేవలం ఒక సెకన్ వ్యవధిలో ఇంధనం స్విచ్ఛ్‌లు ఆఫ్ అయినట్టు పేర్కొంది. అయితే, పైలట్లు ఉద్దేశపూర్వకంగానే ఇలాచేశారని పశ్చిమ మీడియా నివేదించడంపై విమాన నిపుణులు మండిపడుతున్నారు.


విమాన నిపుణుడు కెప్టెన్ ఎషాన్ ఖలిద్ మాట్లాడుతూ.. ‘‘ఒక సెకన్‌లోనే విమానంలోని రెండు ఇంజిన్ల ఇంధన స్విచ్‌లు ఆఫ అవడం అంటే 500 మిల్లీసెకన్లలో రెండూ మార్చడం అన్నమాట.. కాక్‌పిట్‌లో ఎవరు ఉన్నా ఇది చేయడం అనుమానాస్పదమే.. ఒక పైలట్ వాస్తవంగా స్విచ్‌లు ఆపేశాడని అనుకుంటే, మరొక పైలట్ వెంటనే స్విచ్‌లు తిరిగి ఆన్ చేయాల్సిందే కదా? కానీ ఆయన 10 సెకన్ల తర్వాత దాన్ని తిరిగి ఆన్ చేయడమెలా సమంజసం?’ అని ప్రశ్నించారు. ఖలిద్ అభిప్రాయం ప్రకారం.. అది మానవ చర్య కాదు... విమానంలోని ఎలక్ట్రికల్ సిగ్నల్ వల్లే ఇంధన సరఫరా ఆగిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ‘స్విచ్‌లు తిరిగి ఆన్‌ కాలేదు.. కేవలం వాటిని రీస్టార్ట్ చేసే సమయంలో మోషన్ కనిపించింది’ అని ఖాలిద్ పేర్కొన్నారు.


రన్‌వే నుంచి విమానం టేకాఫ్ అయిన 32 సెకన్లకే మెడికల్ కాలేజ్ క్యాంపస్‌లోని హాస్టల్ భవనంపై కుప్పకూలింది. గంటకు 180 నాట్స్ గరిష్ట వేగానికి విమానం చేరుకున్న తర్వాత, ఇంధన సరఫరా నిలిచిపోవడం ఇంజిన్లు ఆగిపోయాయని AAIB నివేదికలో పేర్కొంది. దీని ఆధారంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ‘ఈ కథనాలు ఇద్దరు పైలట్లు తమను తామే చంపుకోవాలనుకున్నారని అంటున్నాయా? కనీసం ఒక పైలట్ ప్రాణాలు నిలబెట్టుకోవాలనుకుంటే, అతడు తక్షణమే చర్య తీసుకోవాలి కదా? కానీ అక్కడ 4 సెకన్ల గ్యాప్ ఉంది’ అని ఖలిద్ వ్యాఖ్యానించారు.


కాగా, ఈ ప్రమాదంపై తుది నివేదిక ఇంకా రావాల్సి ఉంది. కానీ అప్పటికే కొన్ని మీడియా వర్గాలు ఊహాగానాల మీద కథనాలు ప్రచురించడం పట్ల విమాన నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇది టిండర్ డేట్ కాదు.. ఇద్దరు ప్రొఫెషనల్ పైలట్లు, ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి కాదు’ అని ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు. దీనిపై పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇది కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమే అని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa