ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రమ్మీ ఆడుకున్న మంత్రి,,,,సోషల్ మీడియాలో వీడియో

national |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 04:52 PM

ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో ఓ అమాత్యుడు ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుకుంటూ బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన ఘటన మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల ఆ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి హోటల్‌లో అర్దనగ్నంగా ఓ భారీ బ్యాగుతో ఉన్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోపై వివాదం సద్దుమణగకముందే తాజాగా వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకాటే భారీ వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల సమయంలో ఆయన తన మొబైల్‌లో ‘రమ్మీ’ ఆడుతున్నట్లు కనిపించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రోహిత్ పవార్ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేయడంతో రాజకీయ రగడ రాజుకుంది.


ఎక్స్ (ట్విట్టర్)లో వీడియోను షేర్ చేసిన రోహిత్ పవార్ ‘‘రోజుకు సగటున 8 మంది రైతులు ఆత్మహత్యలు సహా పెండింగ్‌లో ఉన్న అన్నదాతల సమస్యలు ఇవేమీ మంత్రికి పట్టడం లేదు... ఆయన అసెంబ్లీలో రమ్మీ అడుకుంటున్నారు... అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ బీజేపీ అనుమతి లేకుండా ఏ పని చేయలేకపోతోంది’’ అని విమర్శించారు. అజిత్ వర్గానికి చెందిన మనిక్రావ్ కోకాటే.. గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సిన్నార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా,పప్పు బాగులేదని క్యాంటీన్ సిబ్బందిపై అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే దాడిచేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది.


శరద్ పవార్ వర్గానికి చెందిన మరో నేత జితేంద్ర అవధ్ ‘‘ఇది రమ్మీ ఆడే ప్రదేశమా? శాసనసభనే రమ్మీ బోర్డు చేసుకున్నారు. వ్యవసాయ మంత్రి అయినా రైతుల సమస్యలపై ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదు. ఈ ఆట చాలా కుటుంబాలను నాశనం చేసింది. మరి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఏం చేస్తారో చూడాలి’’ అని ధ్వజమెత్తారు.


అయితే, ‘మాణిక్‌రావు కోకాటేకు ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన అనేక సందర్బాల్లో అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం’ ఉద్ధవ్ వర్గానికి చెందిన కిశోరి పెడ్నేకర్ మండిపడ్డారు. ‘మంత్రివర్గం నుంచి తొలగించాలని అమిత్ షా భావిస్తోన్న నలుగురిలో కోకాటే ఒకరు.. ఇది ఇది యాదృచ్ఛికం కాదు’ అని సంజయ్ రౌత్ (యూబీటీ) దుయ్యబట్టారు. మహారాష్ట్రలో మరాఠాయేతరులపై దాడులు కొనసాగుతున్న వేళ.. ఈ పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.


ఈ వివాదంపై బీజేపీ నేత సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పనులపై చర్య తీసుకునే ప్రత్యేక చట్టం లేదు. గరిష్ఠంగా హెచ్చరిక ఇవ్వొచ్చు. నేను ఎప్పుడో సీఎం ఫడ్నవీస్‌‌కి ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించాను. కానీ అది కేంద్ర ప్రభుత్వ పరిధి అని అన్నారు’’ అని అన్నారు. అయితే, ఈ సంఘటనను ‘ప్రజాస్వామ్య దేవాలయానికి అవమానం’గా విపక్షాలు అభివర్ణించాయి. కర్ణాటక అసెంబ్లీలో ఇటువంటి ఘటనలు జరిగితే సభ్యులను ఇంటికి పంపారని, కానీ, ఇక్కడ మాత్రం వారు సిగ్గులేకుండా కొనసాగుతున్నారని దుయ్యబడుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa