ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘నన్ను బాంబుతో చంపడానికి కుట్ర’.. బాబాయిపై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

national |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 04:58 PM

త్వరలోనే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బాంబు దాడిలో చంపడానికి కుట్ర పన్నారని చిరాగ్ ఆరోపించారు. అయితే, ఇలాంటి కుట్రలతో తనను భయపెట్టలేరని పేర్కొన్నారు. శనివారం ముంగేర్ జిల్లాలో జరిగిన ర్యాలీ పాల్గొన్న చిరాగ్ పాశ్వాన్.. ఈ సందర్భంగా బాబాయి పశుపతి పరాస్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లపై విమర్శలు గుప్పించారు. ఇటీవల చిరాగ్ పాశ్వాన్‌కు సోషల్ మీడియాలో బాంబు బెదిరింపుకు పాల్పడిన విషయం తెలిసిందే.


‘బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్ అనే నినాదంతో జీర్ణించుకోలేపోతున్నారు... కుల రాజకీయం చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించినవాళ్లు ఇప్పుడు కొత్త కుట్రలు చేస్తున్నారు. ముందు రాజకీయంగా నన్ను మోసం చేశారు, ఇప్పుడు బాంబుతో బెదిరిస్తున్నారు. కానీ నేను షేర్ కా బేటా (పులి పిల్ల) నన్ను భయపెట్టలేరు’’ అని పాశ్వాన్ పరోక్షంగా ఆర్జేడీ నేతలపై విమర్శలు గుప్పించారు.


బాబాయి పశుపతి పరాస్‌పై విరుచుకుపడిన చిరాగ్ పాశ్వాన్.. పార్టీని చీల్చి తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తన ప్రయాణాన్ని అడ్డుకోలేకపోయారని, ఇప్పుడు బాంబులతో చంపడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆర్జేడీతో కలవబోతున్నారని జోస్యం చెప్పారు. బాబాయి, అబ్బాయి మధ్య నాలుగేళ్ల కింద మొదలైన విబేధాలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎల్జీపీ పశుపతి పరాస్ చీల్చి.. చిరాగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. పరాస్ తానే పార్టీ అధ్యక్షుడినని కూడా ప్రకటించుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన బెదిరింపులను చిరాగ్ పాశ్వాన్ రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నా.. LJP (RV) మాత్రం ఆర్జేడీ మద్దతుదారులే దీని వెనుక ఉన్నారని ప్రచారం చేస్తోంది.


చిరాగ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు స్పందిస్తూ.. ఇటీవల ఆయనకు సోషల్ మీడియాలో వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అంటున్నాయి. ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ భట్ ఇప్పటికే సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాలో చిరాగ్‌ను బాంబుతో చంపేస్తామని బెదిరించినట్టు తెలిపారు. నవంబరు-డిసెంబరులో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. నితీశ్ సారథ్యంలోని ఎన్డీయే.. ఆర్జేడీ నాయకత్వంలోని ఇండియా కూటమి ఎన్నికల్లో తలపడనున్నాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిహార్‌లో ఎన్నికల ర్యాలీ మొదలుపెట్టారు. మరోవైపు, అధికారం నిలబెట్టుకోడానికి నితీశ్ సైతం పలు పథకాలను ప్రకటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa