ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లపై శుభవార్త.. రేపే ముహూర్తం ఫిక్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 06:40 PM

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న విజయవాడ, వైజాగ్ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. విశాఖ, విజయవాడ మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలవడానికి సిద్ధమైంది. మొత్తం రూ. 21,616 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% నిధులను ఈ ప్రాజెక్ట్‌లకు సమకూరుస్తాయి. తొలిదశలో విజయవాడ మెట్రో రైలు నిర్మాణం కోసం రూ. 10,118 కోట్లు, వైజాగ్ మెట్రో కోసం రూ. 11,498 కోట్లకు టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. "వైజాగ్ మెట్రో రైలుకు వీఎంఆర్డీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 4,101 కోట్లు నిధులు మల్లించనున్నారు.


అలాగే, "విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ నుంచి రూ. 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా నిధులు ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఇటీవల విజయవాడ మెట్రో కారిడార్లను ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్, జైకా, ప్రపంచ బ్యాంకు వంటి విదేశీ బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డితో వీరు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం రుణం గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విజయవాడ, వైజాగ్ నగరాల్లో రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.


 ఇక, తొలిదశలో విశాఖపట్నంలో 46 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లు నిర్మించనున్నారు. అలాగే, విజయవాడలో రెండు దశల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపడతారు. మొదటి దశలో రెండు, తర్వాతి దశలో మరో కారిడార్ నిర్మాణం చేస్తారు. ఇప్పటికే వీటికి సంబంధించిన డీపీఆర్‌లను ప్రభుత్వం ఆమోదించింది. విశాఖ నగరంలో మొదటి కారిడార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కి.మీ ఉంటుంది. రెండో కారిడార్ గురుద్వార జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5 కి.మి. ఉంటుంది. మూడో కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కి.మీ. ఉంటుంది. అనంతరం రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30 కి.మీ. మేర ఇంకో కారిడార్ నిర్మిస్తారు.


విజయవాడలో కారిడార్ 1ఏ గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ (పీఎన్బీ).. కారిడార్ 1బీ పీఎన్బీ నుంచి పెనమలూరు వరకు నిర్మిస్తారు. రెండో దశలో కారిడార్ 3 బస్టాండ్ నుంచి అమరావతి వరకు నిర్మించనున్నారు. మొదటి దశలో 38.4 కి.మీ. మేర కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించారు. రెండో దశలో 27.5 కి.మీ., మేర మూడో కారిడార్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత పదేళ్ల నుంచి ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా.. ఇప్పటికి కొలిక్కి వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa