ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరా గాంధీ రికార్డును బ్రేక్ చేసిన ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 09:20 PM

భారత రాజకీయ చరిత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక అరుదైన ఘనతను సాధించారు. దేశానికి అవిరామంగా సేవలు అందిస్తున్న ప్రధాన మంత్రుల జాబితాలో ఆయన రెండో అత్యధిక కాలం పని చేసిన ప్రధానిగా నిలిచారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ నెలకొల్పిన రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు. జూలై 25వ తేదీ నాటికి.. ప్రధాని మోదీ తన పదవిలోకి వచ్చి 4,078 (2014 మే 26వ తేదీ నుంచి నేటి వరకు) రోజులు పూర్తి చేసుకున్నారు. ఇది ఇందిరా గాంధీ ప్రధానిగా పని చేసిన 4,077 (1966 జవరి 24వ తేదీ నుంచి 1977 మార్చి 24వ తేదీ వరకు) రోజుల కంటే ఒక్క రోజు ఎక్కువ. దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా సేవలు అందించిన వారిలో ఇప్పటికీ జవహర్‌లాల్ నెహ్రూదే(16 ఏళ్ల 286 రోజులతో) అగ్రస్థానం. ఆయన సేవలను అధిగమించడానికి మోదీకి ఇంకా చాలా సమయం ఉంది.


ప్రధాని మోదీ సాధించిన ఈ ఘనత అనేక కోణాల్లో ప్రత్యేకమైనదిగా నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించి.. సుదీర్ఘ కాలం పాటు ప్రధాన మంత్రిగా పని చేసిన తొలి కాంగ్రెస్సేతర నాయకుడిగా ఆయన చరిత్రకెక్కారు. అంతేకాకుండా ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీని సాధించింది. 1971లో ఇందిరా గాంధీ తర్వాత మరే ఇతర నాయకుడు కూడా తన పార్టీని వరుసగా రెండు సార్లు సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి తీసుకురాలేక పోయారు. ఈ విజయం ప్రధాని మోదీకి ఉన్న తిరుగులేని ప్రజా మద్దతు, రాజకీయ చతురతకు నిదర్శనంగా నిలుస్తోంది.


కేవలం ప్రధాన మంత్రిగానే కాకుండా.. గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా నరేంద్ర మోదీ సుదీర్ఘ కాలం పని చేశారు. రెండు కీలకమైన పదవులలో దీర్ఘకాలం సేవలు అందించిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు వరుసగా గెలిచిన మోదీ.. ప్రధాన మంత్రిగా కూడా రెండు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చారు. అంటే రాష్ట్ర స్థాయి ఎన్నికలు, జాతీయ స్థాయి ఎన్నికలు కలిపి వరుసగా ఆరు ఎన్నికల్లో తన పార్టీని విజయపథంలో నడిపించిన అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు.


మోదీ రాజకీయ ప్రస్థానం యువకుడిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చేరడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఎల్.కె. అద్వానీ చేపట్టిన రథ యాత్రలో.. మురళీ మనోహర్ జోషి చేపట్టిన ఏక్తా యాత్రలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాటు నాయకత్వం వహించారు. ఆపై 2014లో ప్రధాన మంత్రిగా దేశ పగ్గాలు చేపట్టి.. భారతదేశ అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఈ మైలురాయి ఆయన రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా నిలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa