రాజస్థాన్లోని ఝలావార్ జిల్లా పిప్లోడి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రోజు ఉదయం పాఠశాల పని వేళల్లోనే అక్కడి అప్పర్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ భయంకరమైన ఘటనలో కనీసం నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు, పాఠశాల సిబ్బంది శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లు తెలుస్తుండగా.. రెస్క్యూ బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. మరోవైపు ఈ బడిలో చదువుతున్న, ప్రత్యేకించి ఈరోజు బడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులంతా తీవ్రంగా రోదిస్తున్నారు.
శుక్రవారం రోజు ఉదయమే పిల్లలంతా బడికి వెళ్లారు. తమ తమ తరగతుల్లో కూర్చునేందుకు వెళ్తుండగా.. ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే.. స్థానికులు, గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు. పిల్లలను రక్షించే ప్రయత్నం చేశారు. మరోవైపు పోలీసులు, అంబులెన్సులకు ఫోన్ చేసి చెప్పగా.. హుటాహుటిన అందరూ రంగంలోకి దిగారు. ముఖ్యంగా సహాయక బృందాలు వచ్చి శిథిలాలను తొలగిస్తూ.. పిల్లల్ని కాపాడేందుకు చర్యలు చేపడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి జేసీబీ వంటి భారీ యంత్రాలను కూడా రంగంలోకి దించారు. అయితే ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. వారిని మృదేహాలను కూడా ఇప్పటికే బయటకు తీశారు.
అంతేకాకుండా 17 మంది వరకు చిన్నారులు గాయపడగా.. వారందరినీ తక్షణమే మనోహర్ థానా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి తరలించారు. ప్రస్తుతం వీరందరికీ అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు భవనం శిథిలావస్థలో ఉందని.. దీనిపై గతంలోనే అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఫిర్యాదు చేసినప్పుడే భవనాన్ని బాగు చేసి ఉంటే.. ఇంత ఘోరం జరిగుండేది కాదంటూ కన్నీళ్లు పెడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగ అధికారులు.. ఈ పైకప్పు కూలిపోవడానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ స్పందించారు. ఈ విషాధ ఘటన తనను ఎంతో భాదించిందని చెప్పారు. గాయపడిన చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని.. వారి చికిత్సకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అలాగే భవనం పైకప్పు ఎలా కూలిపోయిందో తెలుసుకునేందుకు విచరామ జరిపిస్తామని కూడా హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa