భారతీయులు ఎక్కువగా వెళ్లే టూరిస్ట్ ప్లేస్ ఏది అనగానే మాల్దీవ్స్ పేరు చెప్పేవారు. అయితే గతేడాది మార్చిలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విబేధాలు వెలుగు చూశాయి. డ్రాగన్ దేశం అండ చూసుకుని.. మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు రెచ్చిపోయారు. మాల్దీవ్స్కు నమ్మకమైన మిత్రుడిగా ఉంటున్న ఇండియాపై తన అక్కసు వెళ్లగక్కారు. భారత్కు చెందిన మిలిటరీ సిబ్బంది తమ దేశంలో ఉండకూదని.. అసలు వారు తమ భూభాగంలో తిరగడానికి వీలు లేదంటూ అల్టిమేటం జారీ చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఇండియన్స్.. సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ మాల్దీవ్స్ పిలుపునిచ్చారు. సినీ, రాజకీయ సెలబ్రిటీలు దీనికి మద్దతిచ్చారు. చాలా మంది మాల్దీవ్స్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
పర్యాటక ఆదాయం మీదనే ప్రధానంగా ఆధారపడే మాల్దీవ్స్కు ఇండియన్స్ బాయ్కాట్ దెబ్బ గట్టిగానే తగిలింది. దీంతో ఆ దేశం దిగొచ్చి క్షమాపణలు చెప్పింది. ఆ తర్వాత 2024, అక్టోబర్లో మాల్దీవ్స్ అధ్యక్షుడు భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముయిజ్జు భారత్ తమకు విలువైన స్నేహితుడని తెలిపారు. ఈ పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడ్డాయి. ఈక్రమంలో ప్రస్తుతం విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ.. దీనిలో భాగంగా మాల్దీవ్స్ చేరుకున్నారు. భారత ప్రధానికి మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాల్దీవ్స్కు భారీ రుణ సాయం చేయడానికి మోదీ అంగీకరించారు. ఆ వివరాలు..
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ .. శుక్రవారం బ్రిటన్ నుంచి మాలే చేరుకున్నారు. మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో పాటుగా ఇరు దేశాల మధ్య మైత్రి బంధం ప్రారంభం అయి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతోంది. ఈక్రమంలో మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇరే దేశాధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక సంప్రదింపులు జరిగాయి. రక్షణ, వాణిజ్య, మౌలిక సదుపాయాల రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారంపై మోదీ, మయిజ్జు సంప్రదింపులు జరిపారు.
విబేధాలు ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య పాత బంధాన్ని పునరుద్ధరించేందుకు ప్రధాని మోదీ చేపట్టిన ఈ పర్యటనలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాల్దీవులకు రూ 4,850 కోట్ల రుణాన్ని ప్రకటించారు. అలానే మాల్దీవుల వార్షిక రుణ చెల్లింపుల మొత్తాన్ని 40 శాతం వరకు కుదిస్తున్నట్లు ప్రకటించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న మాల్దీవులకు మోదీ ప్రకటన భారీ ఊరట కలిగించనుంది.
భారత్ తన పొరుగున ఉన్న దేశాలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ.. మహాసాగర్ విధానంలో మాల్దీవులది ప్రముఖ స్థానమని మోదీ ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ముయిజ్జు నాకు స్వాగతం పలకడానికి స్వయంగా ఎయిర్పోర్ట్కి రావడం నన్ను కదిలించింది అని చెప్పుకొచ్చారు.
2023లో అధికారంలోకి వచ్చిన మయిజ్జు చైనా అండ చూసుకుని‘‘ఇండియా ఔట్’’ విధానాన్ని అనుసరించారు. ఈక్రమంలో మోదీ మాల్దీవ్స్ పర్యటనను ఒక దౌత్య విజయంగా భావిస్తున్నారు. మాల్దీవుల రక్షణ కార్యాలయంపై మోదీ భారీ చిత్రాన్ని ప్రదర్శించడం ఈ టూర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa