ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్లో ఒంటరిగా మహిళ.. ఫోటో అని చెప్పి ప్రవేశించిన ఆగంతకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 27, 2025, 10:38 PM

ఆదమరిస్తే అంతే సంగతులు.. ఇదీ నేటి సమాజం తీరు.. కానీ పాపం ఆ పెద్దావిడకు ఈ విషయం తెలియదు. ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, దివ్యా్ంగులకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వాలు పింఛన్ల వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంటాయి. వీటి ద్వారా వారి జీవనానికి కొంతైనా సహకారం అందించవచ్చనేది ప్రభుత్వాల ఆలోచన. అలాగే సంక్షేమ పథకాల అమల్లో అక్కడక్కడా అనర్హులకు ఫలాలు అందడం, అర్హులైన వారికి రాకపోవటం జరుగుతూ ఉంటుంది. అర్హులైనా రాకపోతే.. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సంక్షేమ పథకాల లబ్ధి అందే వీలుంది. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి పథకాల సమయంలోనే మోసాలు జరిగే ప్రమాదం ఉంది. పాపం ఆ మహిళ ఇలాంటోళ్లు కూడా ఉంటారని ఊహించలేకపోయింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన.. ప్రస్తుత సమాజంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తోంది.


వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని నెహ్రూ రోడ్డులో గురివిరెడ్డి, లక్ష్మీదేవి అనే ఇద్దరు దంపతులు నివశిస్తున్నారు. ఈ వృద్ధ దంపతులకు సంతానం లేదు. లక్ష్మీదేవికి ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛనే ఆధారం. అయితే భార్యాభర్తలు ఇంట్లో ఉన్న సమయంలో వారింటికి ఇటీవల ఓ గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చారు. తాను సచివాలయం నుంచి వచ్చానని.. ప్రభుత్వం అందించే పింఛన్ మీకు అందుతోందా అంటూ వాకబు చేశారు. వృద్ధాప్య పింఛన్ వస్తోందని వారు సమాధానం ఇవ్వగానే.. దివ్యాంగుల పింఛన్ ఇప్పిస్తా నెలకు రూ.6000లు వస్తుందని నమ్మబలికాడు.


ఆధార్కార్డు తీసుకుని మున్సిపల్ ఆఫీసుకు వెళ్తే సర్టిఫికెట్ ఇస్తారని.. దానిని సచివాలయంలో ఇవ్వాలంటూ వెళ్లిపోయాడు. పాపం ఈ విషయాన్ని గురివిరెడ్డి నమ్మేశాడు. ఆధార్ కార్డు తీసుకుని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. అదే సమయంలో ఇంటికి దగ్గరలోనే వేచి ఉన్న మరో దుండగుడు.. గురివిరెడ్డి బయటకు వెళ్లగానే మహిళ వద్దకు వచ్చాడు. పింఛన్ దరఖాస్తుకు ఫొటో కావాలని నమ్మబలికాడు. ఒంటి మీద బంగారం ఉంటే డబ్బులు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటారని.. శరీరంపై ఉన్న బంగారం తీసేయాలని సూచించాడు. దీంతో లక్ష్మీదేవి అమాయకంగా తన మెడలోని బంగారు చైన్, చేతి గాజులు తీసి వంటగదిలో ఉంచారు.


ఈ సమయంలోనే ఫోటో సరిగ్గా రావటం లేదంటూ మహిళను వెనక్కి జరగాలని సూచించిన ఆగంతకుడు.. ఆమెను అలా బెడ్ రూమ్ వరకూ తీసుకెళ్లి, ఒక్కసారిగా గదిలోకి తోసేసి బయట గడియ పెట్టేశాడు. అనంతరం వంటగదిలో ఉన్న బంగారు నగలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన లక్ష్మిదేవి. దొంగా దొంగా అంటూ కేకలు వేయటంతో స్థానికులు గుర్తించి గడియ తీశారు. ఈ ఘటనపై గురివిరెడ్డి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa