వైసీపీ ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి షాక్ తగిలింది. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఏపీ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం ఆయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మద్యం కేసులో బెయిల్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కొట్టివేసింది. మరోవైపు ఈ కేసులో పరారీలో ఉన్న నిందితులపై నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్లకు అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని.. డిస్టిలరీలు, లిక్కర్ సరఫరా కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని జూన్ నెలలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. చెవిరెడ్డిని అతని అనుచరుడు వెంకటేష్ నాయుడును బెంగళూరులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఏపీ మద్యం కేసులో రాజంపేట ఎంపీ, వైసీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ ఏసీబీ ఆఫీసులో విచారణకు హాజరైన ఆయనను సుమారుగా ఏడు గంటలపాటు విచారించిన అనంతరం.. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకూ 12 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరికొంతమంది అరెస్టుకు వారెంట్ జారీ చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టును సిట్ అధికారులు కోరగా.. అందుకు అనుమతి ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం డిస్టిలరీలు, సంస్థల నుంచి డబ్బులు వసూలు చేశారని.. ఆ డబ్బులను ఎన్నికల సమయంలో ఉపయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపైనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రభుత్వం ఇలా అక్రమ అరెస్టులు చేయిస్తోందని ఆరోపిస్తోంది. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి అరెస్టులు చేస్తోందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa