కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. వారిలో కొంతమంది తలనీలాలు సమర్పించుకుని శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటే.. మరికొంతమంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే ట్రస్టులకు విరాళాలు అందించి శ్రీవారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం కూడా అలాగే తిరుమల శ్రీవారికి భారీ విరాళం సమర్పించింది. హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రాంతంలో ఉండే వసంతపురి కాలనీకి చెందిన కనకదుర్గ ప్రసాద్, సునీత దేవి దంపతులు తిరుమల శ్రీవారికి తమ ఇంటిని విరాళంగా అందించారు. రూ.18.75 లక్షల విలువ చేసే 250 చదరపు గజాల ఇంటిని శ్రీవారికి విరాళంగా అందించారు. మంగళవారం రోజు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి చేతికి ఆస్తి పత్రాలను అందజేశారు.
అయితే హైదరాబాద్కు చెందిన భాస్కర్రావు అనే మాజీ ఐఆర్ఎస్ అధికారి కూడా తిరుమల శ్రీవారికి ఇలాగే ఇంటిని, ఆస్తిని విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే. రూ.3 కోట్లు విలువైన ఇంటిని, రూ.66 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్లను తన మరాణానంతరం వీలునామా ద్వారా తిరుమల శ్రీవారికి, టీటీడీకి విరాళంగా అందజేశారు. ఆయన స్ఫూర్తితో దుర్గాప్రసాద్ దంపతులు తమ ఇంటిని శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ దంపతులకు సంతానం లేకపోవడంతో తమ తదనంతరం తమ ఆస్తి శ్రీవారికి చెందేలా వీలునామా రాసి.. ఆ పత్రాలను టీటీడీ ఏఈవో చేతికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ ఏఈవో అభినందించారు.
మరోవైపు మంగళవారం ఉదయం కూడా తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ తిరుమల శ్రీవారికి సుమారు రూ.2.40 కోట్లు విలువైన.. రెండున్నర కేజీల బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందజేసింది. శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఏఈవో చేతికి సంస్థ ప్రతినిధులు ఈ బంగారు శంఖు, చక్రాలను అందజేశారు.
తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం
మరోవైపు ఆగస్టు 8వ తేదీ శుక్రవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆలయంలో వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు.. అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో విహరిస్తారు. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం జూలై 31వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 150 టికెట్లు విడుదల చేయనున్నారు.
అలాగే ఆలయం వద్ద కూడా కౌంటర్లో ఆగస్టు 7న ఉదయం 9 గంటలకు 150 టికెట్లు విక్రయిస్తారు. వేయి రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేయవచ్చని టీటీడీ తెలిపింది. మరోవైపు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో అభిషేకం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల సేవ, వేదాశ్వీరచనం, బ్రేక్ దర్శనం సేవలను రద్దు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa