ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితీశ్ కుమారే ముఖ్యమంత్రి..: మాట మార్చిన చిరాగ్ పాశ్వాన్

national |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 08:21 PM

బీహార్ రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు తాను మద్దతు తెలిపినందుకు సిగ్గు పడుతున్నానంటూ చెప్పుకొచ్చిన కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్.. తాజాగా ప్లేటు మార్చేశారు. కాబోయే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌యే అని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నితీష్ కుమారే మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. అలాగే ఓటరు జాబితా సవరణను కూడా సమర్థించారు. దీంతో రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వారంతా ఆశ్చర్య పోతున్నారు.


కేవలం రెండు రోజుల క్రితమే నితీష్ కుమార్ ప్రభుత్వం నేరగాళ్లకు లొంగిపోయిందని ఆరోపిస్తూ.. తన మద్దతు పట్ల చిరాగ్ పాశ్వాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో రోజురోజుకూ హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ నేరాలను నియంత్రించడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని చెప్పుకొచ్చారు. క్రైమ్ రేటును ప్రభుత్వం తగ్గించలేకపోతుందని వివరించారు. బిహార్‌లో ప్రజలు సురక్షితంగా ఉండలేకపోతున్నారని.. ప్రజలను రక్షించలేని స్థితిలో ఉన్న సర్కారుకు తాను మద్దతు ఇస్తున్నందుకు అసంతృప్తిగా, సిగ్గుగా ఉందని అన్నారు.


ఈ కామెంట్లు చేసిన రెండు రోజులకే కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మాట మార్చడంతో.. అంతా షాక్ అవుతున్నారు. పాశ్వాన్ తన ప్రకటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. జరగబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమియే కచ్చితంగా విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది అధికార కూటమిలో నితీష్, పాశ్వాన్ మధ్య సయోధ్య కుదిరిందని స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంగా పాశ్వాన్ బీహార్‌లో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక, విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను కూడా సమర్థించారు.


ప్రతిపక్షాలు ఈ ప్రక్రియపై చేస్తున్న విమర్శలను చిరాగ్ పాశ్వాన్ తిప్పికొట్టారు. ఓటరు జాబితా సవరణ అనేది అత్యవసరమని, పారదర్శకంగా జరుగుతోందని ఆయన ఉద్ఘాటించారు. ఇది కేవలం ఓటు హక్కును కాలరాయడానికి చేస్తున్న కుట్ర అనే ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అంతేకాకుండా ప్రతిపక్షాలపై చిరాగ్ పాశ్వాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


'ఆపరేషన్ సింధూర్‌'పై ప్రధానమంత్రి మోదీని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రతిపక్షాలు సైన్యాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించారు. అనేక సమస్యలను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. పాశ్వాన్ ఈ వ్యాఖ్యలు బీహార్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఆయన యూ-టర్న్, బీహార్ ఎన్నికల వ్యూహంలో ఎన్డీఏకు బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa