పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసాను మూడే మూడు గంటల్లో భారత సైన్యం మట్టుబెట్టింది. చైనీస్ డివైజ్ సాయంతో అతడి జాడను గుర్తించి.. మెరుపు వేగంతో అతడి పని పట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ మహాదేవ్ను చేపట్టిన రాష్ట్రీయ రైఫిల్స్, పారా కమాండోలు అడవుల్లోకి వెళ్లి.. ఉగ్రవాదులను గుర్తించి కాల్పులు జరిపారు. మొత్తంగా ముగ్గురిని చంపేశారు. మరి వీరిని హతమార్చేందుకు చైనీస్ డివైజ్ ఎలా ఉపయోగపడింది, అసలు వారి జాడ సైన్యానికి ఎలా తెలిసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఈ ఉగ్రమూక జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోనే అత్యంత ఎత్తైన మహాదేవ్ పర్వత పరిసరాల్లో నక్కినట్లు భారత సైన్యానికి 14 రోజుల క్రితమే సమాచారం అందింది. అయితే ఈ పర్వతం 13 వేల అడుగుల ఎత్తుతో.. ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాలను కశ్మీరీ హిందువు సావన్ (శ్రావణ) మాసంలో చాలా పవిత్రంగా చూస్తుంటారు. ఇలాంటి సమయంలోనే ఉగ్రవాదులు అక్కడ ఉన్నట్లు తెలియగా.. సైన్యం వెంటనే అప్రమత్తం అయింది. ఈక్రమంలోనే వారిపై ఓ కన్నేసింది. ముఖ్యంగా ఉగ్రవాదులు.. ఎల్ఈటీ ఎన్క్రిప్టెడ్ సందేశాల కోసం చైనీస్ రేడియోను ఉపయోగిస్తుంటారు. ఈ విషయం తెలిసిన సైన్యం.. సదరు పర్వతాల్లో ఇది యాక్టివ్గా ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నాలు చేశారు.
ఈ సమయంలోనే ఆదివారం రోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ టీ82 యాక్టివేట్ అయినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. అయితే పహల్గాం ఉగ్రదాడిలోనూ వీటిని వాడగా.. ఆ ముష్కరులే వీరని భావించారు. దీంతో వెంటనే దాని లొకేషన్ను చూశారు. అది డాచిగామ్ నేషనల్ పార్కులో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇక వెంటనే ఆపరేషన్ మహాదేవ్ను ప్రారంభించారు. సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ముఖ్యంగా ఉదయం 8 గంటలకే దళాలు డ్రోన్ ద్వారా చిక్కటి అడవీ ప్రాంతంలో వెతుకులాట మొదలు పెట్టింది. ఈక్రమంలోనే ముష్కరుల జాడ బట్టబయలు అయింది.
తొలి రౌండ్లోనే ఉగ్రవాదుల హతం..
ఉదయం 9.30 గంటలకు రాష్ట్రీయ రైఫిల్స్, పారా ఎస్ఎఫ్ కమాండాలతో మహదేవ్ హిల్స్ వైపు వెళ్లారు. 10 గంటల సమయంలో పారా కమాండోలు ఉగ్రవాదుల కదలికలను గుర్తించారు. అటవీ ప్రాంతం చిక్కగా ఉండడం.. మొత్తం చెట్లతో నిండుగా ఉండడంతో వారంతా పొజిషన్ తీసుకునే సరికే 11 గంటలు అయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫైరింగ్ మొదలు పెట్టాయి. తొలి రౌండ్స్లోనే ఉగ్రవాదులకు బుల్లెట్లు తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 11.45 గంటలకు ఓ ముష్కరుడు తప్పించుకునేందుకు యత్నించగా.. మళ్లీ కాల్పులు జరిపారు. చివరకు అతడిని చంపేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి రెండు కిలో మీటర్ల రేడియస్లో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని గాలింపు చేపట్టారు. 12.45 గంటలకు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించారు.
అంతేకాకుండా ముష్కరుల నుంచి అమెరికా తయారీ ఎం-4 కార్బైన్, ఏకే-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రనేడ్లు, భారీ సంఖ్యలో తూటాలు, అల్ట్రా సెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ ఉగ్రవాదులు మరో భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృతుల్లో పహల్గాం దాడి మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసా ఉన్నట్లు గుర్తించిన సైన్యం ప్రకటించగా.. దేశ ప్రజలంతా సంబుర పడ్డారు. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన అతడు చనిపోయినట్లు తెలుసుకుని భారత సైన్యానికి కృతజ్ఞతలు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa