ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం ఉగ్రవాదులు పాక్‌కు చెందిన వాళ్లే....: అమిత్ షా

national |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 08:09 PM

పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన వాళ్లేనని మీకెలా తెలుసంటూ.. కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం సోమవారం రోజు పార్లమెంట్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. అయితే మంగళవారం రోజు అదే పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా సమాధానం తెలిపారు. ముఖ్యంగా పాకిస్థాన్ దేశాన్ని, ఉగ్రవాదులను కాపాడడం వల్ల ఆయనకు ఏం వస్తుందో చెప్పాలని కోరారు. వారు నిజంగానే పాకిస్థాన్‌కు చెందిన వాళ్లేనని.. వారి ఓటర్ ఐడీ నెంబర్లు, చాక్లెట్లే అందుకు సాక్ష్యం అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సోమవారం రోజు భారత సైన్యం ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి.. పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిందని స్పష్టం చేశారు.


సోమవారం రోజు కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం.. పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, దానికి ఎవరు బాధ్యులో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే తాజాగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ ప్రశ్నకు బదులు ఇచ్చారు. తాము అధికారంలో ఉండడం వల్ల కాంగ్రెస్ నాయకులు అడిగిన ప్రశ్నలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని రుజువు ఏంటని అడిగారని.. అసలు దాయాది దేశాన్ని రక్షిస్తే వారికి ఏం వస్తుందో చెప్పాలని తాను అడగాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిదంబరం అలా మాట్లాడడం చూస్తుంటే ఆయన పాకిస్థాన్‌కు క్లీన్ చిట్ ఇస్తున్నట్లు అర్థం అవుతోందన్నారు.


అంతేకాకుండా పహల్గాంలో దాడికి పాల్పడి 26 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ముష్కరులు పాకిస్థాన్‌కు చెందిన వాళ్లేనని స్పష్టం చేశారు. దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదులకు.. పాకిస్థాన్ ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయని అన్నారు. అంతే కాకుండా ఆ నంబర్లను తనిఖీ చేయగా.. అక్కడివేనని తేలాయని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం అవి తమ వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా ముష్కరుల నుంచి స్వాధీనం చేసుకున్న చాక్లెట్లు కూడా పాకిస్థాన్‌లో తయారు చేసినవేనని.. ఈ సాక్ష్యాలు చూస్తుంటేనే వారు దాయాది దేశానికి చెందిన వాళ్లని అర్థం అవుతుందని అన్నారు.


అంతేకాకుండా పహల్గాం దాడికి సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని అమిత్ షా ప్రకటించారు. కీలక నిందితుడు సులేమాన్‌ను సోమవారం రోజు మట్టుబెట్టారని పేర్కొన్నారు. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా వారిని చంపిన భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa