మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రి మాణిక్ రావ్ కొటాటే.. రమ్మీ ఆడారంటూ వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే దీనిపై ఆయన ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చారు. తానేమీ గేమ్స్ ఆడలేదని.. అదొక పాపప్ నోటిఫికేషన్ అని చెప్పారు. కానీ ప్రజలు, విపక్షాలు మాత్రం ఆయన్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే తాజాగా రాష్ట్ర సర్కారు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మాణిక్ రావ్ కొటాటేను పదవి నుంచి తొలగించకుండా.. క్రీడల శాఖను అప్పగించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ ఘటన ఆగస్టు 1న రాష్ట్ర అసెంబ్లీలో జరిగింది. సభలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో వ్యవసాయ మంత్రి మాణిక్ రావ్ కోకాటే తన మొబైల్లో రమ్మీ గేమ్ ఆడుతూ కెమెరాలకు చిక్కారు. ఈ వీడియో క్లిప్ తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో.. ఒక మంత్రి ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మహారాష్ట్ర ప్రజలను అవమానించడమేనని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
ఈ వివాదంపై మాణిక్ రావ్ కోకాటే మొదట్లో ఆ ఆరోపణలను ఖండించారు. తాను మహారాష్ట్ర ద్విసభల శాసన సభలో దిగువ సభ కార్యకలాపాలను ఎగువ సభ నుంచి పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అయితే ఆ సమయంలో తన ఫోన్లో ఆన్లైన్ గేమింగ్ ప్రకటన పాపప్ అయిందని వివరించారు. దాన్ని కొన్నిసార్లు దాటవేయడానికి ప్రయత్నించినా కుదరలేదని, మూడో ప్రయత్నంలోనే అది పని చేసిందని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో స్పష్టంగా రమ్మీ ఆడుతున్నట్లు చూపించడంతో ఆయన వివరణ ఎవరూ నమ్మలేదు.
ఇలా ఈ వ్యవహారంపై మరింత పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రంగంలోకి దిగారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి ఈ ఘటనపై చర్చించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వంలో ఇలాంటి చర్యలను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. దీంతో అందరూ ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని భావించారు. కానీ సర్కారు ఊహించని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మాణిక్ రావ్ కోటాటేను వ్యవసాయ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించి.. క్రీడలు, యువజన సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. అలాగే వ్యవసాయ శాఖను.. ఇప్పటి వరకు క్రీడాశాఖను చూసిన ఎన్సీపీ మంత్రి దత్తాత్రేయ భరణెకు అప్పగించారు.
అయితే ఈ విషయాన్ని నేరుగా వెల్లడించిన సర్కారు వర్గాలు.. షాకింగ్ కామెంట్లు చేశాయి. వివాదాస్పదమైన చర్యలకు పాల్పడే మంత్రులపై తీవ్ర పరిణామాలు తప్పవనే సంకేతాలు ఇచ్చినందుకే ఈ మంత్రివర్గ మార్పు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కానీ దీనిపై కూడా విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రిని పదవి నుంచి తొలగించకుండా కేవలం శాఖను మార్చడం జవాబుదారీ తనం అనిపించుకోదని వివరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నేతలు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయనకు క్రీడల శాఖను అప్పగించడమంటే అసెంబ్లీలో రమ్మీ ఆడటాన్ని అధికారికంగా అనుమతించినట్లేనని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa