ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే దిశగా కీలక చర్యలకు శ్రీకారం చుడుతోంది. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా కీలక అడుగు వేసింది. అందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా ఆగస్ట్ 10 నుంచి సచివాలయంలోకి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలోకి బయట నుంచి వచ్చే వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేయనున్న సెక్యూరిటీ సిబ్బంది.. వాహనాలలో వాటర్ బాటిల్ ఉంటే ఆ బాటిళ్లను స్వాధీనం చేసుకుంటారు. అలాగే సచివాలయ ఉద్యోగులకు రీయూజబుల్ స్టీల్ వాటర్ బాటిల్ ఇవ్వనున్నారు. క్యాంటీన్లు, సచివాలయంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ రీయూజబుల్ స్టీల్ బాటిళ్లు అందుబాటులో ఉంచుతారు. ఆగస్ట్ 15 నుంచి సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తిస్థాయిలో నిషేధం అమలు చేయనున్నారు.
మరోవైపు ప్లాస్టిక్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. ప్లాస్టిక్ వలన పర్యావరణానికి, ప్రజలకు హానీ కలుగుతుందని.. ప్లాస్టిక్ చేసే అనర్థాలు ఏమిటో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోందని అన్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయాలు చూపించగలిగితే ప్లాస్టిక్ రహిత రాష్ట్రం సాధ్యమవుతుందని అన్నారు. అందులో భాగంగానే 2026లో వచ్చే ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా స్వచ్ఛరథం కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. స్వచ్ఛరథం కార్యక్రమంలో.. చెత్తను వేసిన వారికి నిత్యావసరాలు ఉచితంగా అందిస్తారు. స్వచ్ఛరథం గ్రామాల్లోని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్తుంది. ఆ సమయంలో ప్రజలు తమ ఇళ్లల్లోని చెత్తను స్వచ్ఛరథం సిబ్బందికి అందిస్తారు.
స్వచ్ఛరథం సిబ్బంది ప్రజలు అందించిన చెత్తను తూచి.. లెక్కగట్టి అందుకు సమానమైన నిత్యావసరాలను ఉచితంగా అందిస్తారు. గుంటూరు గ్రామీణం మండలంలో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ విజయవంతమైతే మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa