ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు సేవలు అతి త్వరలో ప్రారంభం

national |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 07:27 PM

దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు సేవలను అతి త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే, ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటల 7 నిమిషాలకు తగ్గిపోతుందని తెలిపారు.ఆయన ఇవాళ అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా-పుణె ఎక్స్‌ప్రెస్, జబల్‌పూర్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి గుజరాత్‌లోని వాపి, సూరత్, వడోదర, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాలను కలుపుతూ 508 కిలోమీటర్ల పొడవైన హై-స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు.గుజరాత్‌లో చేపట్టనున్న మరిన్ని రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా అశ్విని వైష్ణవ్ ప్రస్తావించారు. పోర్‌బందర్-రాజ్‌కోట్ మధ్య కొత్త రైలు, రణవావ్ స్టేషన్‌లో రూ.135 కోట్లతో కోచ్ మెయింటెనెన్స్ కేంద్రం, పోర్‌బందర్‌లో రైల్వే ఫ్లైఓవర్, రెండు గతి శక్తి కార్గో టెర్మినళ్లు వంటివి రానున్నాయని వెల్లడించారు.గత 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 34,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాకులు వేశామని, ఇది రోజుకు సగటున 12 కిలోమీటర్లతో సమానమని ఆయన గుర్తుచేశారు. రైళ్ల రాకపోకలను నిలిపివేయకుండానే 1,300 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం భారత రైల్వే చరిత్రలో అపూర్వమైన ఘట్టమని కొనియాడారు. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ వంటి ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టామని, తక్కువ ధర టిక్కెట్లతో అత్యాధునిక సౌకర్యాలున్న 8 అమృత్ భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని ఆయన అన్నారు. గుజరాత్‌తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వాల సహకారంతో రైల్వే ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అశ్విని వైష్ణవ్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa