ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొలంలో వరుసగా దొంగతనాలు,,,,డిటెక్టివ్‌గా మారిపోయిన రైతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 07:00 PM

ఎండనకా, వాననకా, పగలనకా, రేయనకా.. వానలొచ్చినా, వారదలొచ్చినా.. వరుణ దేవుడు ముఖం చాటేసినా, రేపటి మీద నమ్మకంతో, భవిష్యత్ మీద భరోసాతో.. వచ్చే అత్తెసరు లాభం కోసం నిరంతరం శ్రమించే వాడే.. రైతు. అందుకే రైతును దేశానికి వెన్నెముక అని అంటారు. పరీక్షల్లో ఒక్కసారి, రెండుసార్లు తప్పితేనే డీలా పడిపోతారు నేటి విద్యార్థులు.. ఒకట్రెండు ప్రయత్నాల్లో ఉద్యోగం రాకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది యువత. కానీ కాలం ఎన్నిసార్లు ఎదురుతన్నినా.. హలం వదలని ధీశాలి, ధైర్యశాలి, ఆత్మవిశ్వాసం పుణికిపుచ్చుకున్నవాడే అన్నదాత.. అలాంటి రైతును తక్కువగా అంచనా వేశారు కొంతమంది దొంగలు. కానీ ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుంటే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో.. చేసి చూపించాడు ఆ రైతు.. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఆ రైతు చేసిన పని ఇప్పుడు స్థానికంగా ప్రశంసలు కురిపిస్తోంది..


అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సత్తారుపల్లికి చెందిన అశోక్‌రెడ్డికి కొంత వ్యవసాయ పొలం ఉంది. అందులో పంటలు సాగుచేస్తుంటారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో మొక్కజొన్న వేయాలని నిర్ణయించుకున్నారు. మొక్కజొన్న నాటేందుకు కూలీలను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే అదే రోజు రాత్రి అశోక్ రెడ్డి పొలంలో దొంగలు పడ్డారు. పొలంలో ఉన్న డ్రిప్పు పైపును చోరీ చేశారు. అయితే అశోక్ రెడ్డి పొలంలో డ్రిప్పు పైపులు, కేబుల్ వైర్లు చోరీ చేయడం అదే మొదటిసారి కాదు. 2020లో ఓసారి, 2022 సంవత్సరంలో మరోసారి కూడా ఇలాగే పొలంలో ఉన్న డ్రిప్పు పైపులు చోరీకి గురయ్యాయి. లక్ష రూపాయలు విలువ చేసే డ్రిప్పు పైపులు దొంగతనం కావటంతో గతంలో అశోక్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో ఒకటికి మూడుసార్లు తన పొలంలో డ్రిప్పులు చోరీకి గురౌతూ ఉండటంతో.. ఈసారి ఎలాగైనా దొంగలను పట్టుకోవాలని తానే ప్లాన్ చేశారు అశోక్ రెడ్డి..


ఇంటర్నెట్‌లో వెతికి జీపీఎస్ ట్రాకర్ కొనుగోలు చేశారు. ఈ జీపీఎస్‌ను డ్రిప్పు పైపు మధ్యలో ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలియని దొంగలు శనివారం రాత్రి చోరీకి వచ్చి మనోడు వేసిన ప్లాన్‌తో అడ్డంగా దొరికిపోయారు. పొలంలో ఉన్న డ్రిప్పు పైపులను శనివారం రాత్రి దొంగలు చోరీ చేశారు. ఆదివారం ఉదయాన్నే పొలానికి వచ్చిన అశోక్ రెడ్డి.. పైపులు చోరీ అయిన విషయం గుర్తించారు. వెంటనే జీపీఎస్ సాయంతో ఎక్కడ వెళ్తున్నాయనే సంగతి తెలుసుకున్నారు.


ఇతర రైతుల సాయంతో ఎన్ఎస్ గేట్ సమీపంలో ఉన్న వాహనాన్ని, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అశోక్ రెడ్డి పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నా్రు. మరోవైపు ఇప్పటి వరకూ తమ పొలాల్లో చోరీ అయిన డ్రిప్పు పైపులను రికవరీ చేయించి ఇవ్వాలని మిగతా రైతులు పోలీసులను కోరుతున్నారు. అయితే ఆ చోరీలు కూడా వీరి పనేనా, వేరే వారి హస్తం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa