ఏపీలో 2019-2024 మధ్య అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రేషన్ డెలివరీ కోసం వాహనాలను తీసుకొచ్చింది. ఈ వాహనాలను సబ్సిడీపై కొంతమంది యువతకు అందించిన సంగతి తెలిసిందే.. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ వాహనాలను రద్దు చేసింది. రేషన్ వాహనాల పేరుతో ప్రజాధనం వృథా చేశారని ఆరోపించింది. మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా పాత పద్ధతిలోనే షాపుల దగ్గరే రేషన్ అందిస్తున్నారు. అయితే 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెలా రేషన్ డోర్డెలివరీ చేస్తున్నారు. అయితే రేషన్ వాహనాలను ఎత్తేయడంతో.. ఆ వాహనాల వల్ల ఉపాధి పొందిన ఉద్యోగులు ఆందోళనలు చేశారు. అయినా సరే ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు.. షాపుల దగ్గరే రేషన్ను పంపిణీ చేస్తోంది. 9,260 వాహనాలను ఉచితంగా లబ్ధిదారులకు ఇచ్చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలను రద్దు చేయడంతో.. కొందరు ఈ వాహనాలకు ఉన్న సెటప్ మొత్తం మార్చేసి సొంత వాహనాలుగా ఉపయోగించుకుంటున్నారు. అయితే తాజాగా కడప జిల్లాలో ఈ రేషన్ వాహనాలను సరికొత్తగా వాడేస్తున్నారు. ఈ వాహనాలను సరికొత్తగా ముస్తాబు చేసి సరైన మార్గంలో వాడుకుంటున్నారు. ఈ జమ్మలమడుగులో ‘ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ’ కింద స్కూళ్లకు భోజనం అందించేందుకు ఈ రేషన్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ పథకానికి సంబంధించి జమ్మలమడుగులో రెండు స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయగా.. అక్కడి నుంచి దాదాపు 50 స్కూళ్లకు భోజనం పంపిస్తున్నారు.
ఈ భోజనం స్కూళ్లకు తరలించేందుకు 5 ఎండీయూ వాహనాలను కొత్తగా మార్చేసి వాడేస్తున్నారు. ఈ మేరకు ఈ రేషన్ వాహనాలపై స్కూళ్లలో విద్యార్థులకు ఏ రోజు ఏయే రకాల భోజనం వడ్డిస్తారనే మెనూతో సహా డొక్కా సీతమ్మ ఫోటోను ముంద్రించారు. ఇప్పుడు కడప జిల్లాలో ఇలా ప్రయోగం చేస్తుండగా.. ఈ వాహనాలు అందర్ని ఆకర్షిస్తున్నాయి. ఈ ఐడియా ఏదో బావుందంటూ పలువురు మెచ్చుకుంటున్నారు. ఈ ఆలోచనను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa