ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హతమైన ఆ ముగ్గురూ పాక్ ఉగ్రవాదులే.. పక్కా ఆధారాలు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 07:10 PM

జమ్మూ కశ్మీర్‌లోని దచిగామ్ అటవీ ప్రాంతంలో జులై 28న జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థానీ లష్కరే తొయిబా కమాండర్లేనని స్పష్టమైన ఆధారాలతో నిరూపించామని భద్రతా అధికారులు సోమవారం ప్రకటించారు. పహల్గామ్‌లోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకులు ప్రాణాలు తీసిన ముష్కరులు దాచిగాం అడవుల్లో తలదాచుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ముష్కరుల కోసం భారత్ సైన్యం ‘ ఆపరేషన్ మహాదేవ్ ’ చేపట్టి.. జులై 28న వారిని మట్టుబెట్టింది.


పాకిస్థాన్ ఓటర్ ఐడీ స్లిప్‌లు, పాక్ నాడా బయోమెట్రిక్ డేటా, కరాచీలో తయారైన చాకెట్ ర్యాపర్లు, (‘కాండీల్యాండ్’, ‘చాకోమాక్స్’ బ్రాండ్లు), శాటిలైట్ ఫోన్ లాగ్స్, జీపీఎస్ డేటా, పహల్గామ్ ఘటన స్థలంలో లభించిన డీఎన్ఏ నమూనాలు సహా అన్ని సాక్షాలు ఈ ఉగ్రవాదులు పాకిస్థానీయులేనని నిర్ధారించాయి.


పహల్గామ్‌ దాడికి ప్రధాన సూత్రధారి, పాక్ ఆర్మీ మాజీ కమాండో సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసా, అబూ హంసా అలియాస్ ‘ఆఫ్గన్’, యాసిర్ అలియాస్ ‘జిబ్రాన్’‌లు ఆపరేషన్ మహాదేవ్‌లో హతమయ్యారు. శాటిలైట్ ఫోన్‌ల నుంచి పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు ప్రతి రాత్రి కాల్స్ వెళ్లాయని, వారిలో లష్కరే తొయిబా దక్షిణ కశ్మీర్ కమాండర్ సజిద్ సైఫుల్లా జట్ ప్రధాన హ్యాండ్లర్‌గా ఉన్నట్లు వాయిస్ విశ్లేషణలో నిర్ధారణ అయ్యిందన్నారు. .


ఈ ఉగ్రవాదులు గురేజ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి మే 2022లో భారతదేశంలోకి చొరబడ్డారు. పర్వేజ్, బషీర్ అహ్మద్ జోతార్ అనే ఇద్దరు కశ్మీరీలు వారికి ఆశ్రయం కల్పించినట్టు అధికారులు తెలిపారు. జులై 29న రావలకోట్‌కు చెందిన లష్కరే తొయిబా కమాండర్ రిజ్వాన్ అనీస్ హతుల కుటుంబాలను కలిసి ‘ఘైబానా నమాజ్-ఎ-జనాజా’ ఏర్పాటు చేసినట్టు సాక్ష్యాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఆధారాలన్నీ పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ నేరుగా పాలుపంచుకుందని నిరూపించేలా భారత ప్రభుత్వం త్వరలో అంతర్జాతీయ వేదికలపై సమర్పించనుంది. పహల్గామ్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత సైన్యం రెండు వారాల పాటు ఆపరేషన్ చేపట్టింది. దాడి జరిగిన రోజే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.. కశ్మీర్‌కు చేరుకుని భద్రత బలగాలకు దిశనిర్దేశం చేశారు. ముష్కరులు తప్పించుకోకుండా పద్మవ్యూహం పన్నిన సైన్యం... సొరంగాల్లో దాక్కున్నవారిని బయటకు రప్పించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa