ఉత్తర ప్రదేశ్ సహారన్పుర్లోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ సర్కారు పలు ప్రభుత్వ పాఠశాలలను మూసేసింది. అయితే ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ.. ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ ఆ ప్రాంతంలో బడులు నడిపిస్తోంది. ముఖ్యంగా ఈ పార్టీకి చెందిన కొందరు నేతలు పీడీఏ పాఠశాలలను నిర్వహిస్తున్నారు. అయితే రామ్నగర్లో తన ఇంట్లో నడుపుతున్న పీడీఏ పాఠశాలలో ఫర్హాద్ ఆలం గడా చిన్నారులకు రాజకీయ అక్షరమాలను నేర్పించారు. యూనిఫాం ధరించి మరీ బడికి వచ్చిన పిల్లలకు.. ఏ ఫర్ అఖిలేష్, బీ ఫర్ బాబాసాహెబ్ (బీఆర్ అంబేద్కర్), డీ ఫర్ డింపుల్ (డింపుల్ యాదవ్) వంటి పదాలను బోధించారు. ఆ సమయంలో దీన్ని వీడియోగా కూడా తీసుకోగా.. ఇది కాస్తా నెట్టింట వైరల్ అయింది.
ఇలా ఈ వీడియో చిన్నారుల తల్లిదండ్రుల కంట పడగా.. వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలకు చదువు బోధిస్తామని చెప్పి.. రాజకీయ ప్రయోజనాల కోసం వారిని వాడుకోవడం దారుణం అంటూ మెయిన్ సింగ్ అనే స్థానిక నివాసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి ఫర్హాద్ ఆలం గడాపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. బ్రిటీష్ పాలనలో కూడా చదువుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం విద్యను వ్యతిరేకిస్తూ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
బీజేపీకి విద్య వ్యతిరేక వైఖరి బయట పడిందని.. ఇది ఖండించదగిన చర్య అని అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఫర్హాద్ ఆలం గడా ఖండించారు. తాను కేవలం అక్షరమాలనే కాకుండా.. సమాజ్వాదీ ఆదర్శాలను పిల్లలకు బోధిస్తున్నానని, ఈ పీడీఏ పాఠశాల ద్వారా మహనీయుల చరిత్రను తెలియజేస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు. జిల్లాలో ఇలాంటి మరిన్ని పాఠశాలలు ఏర్పాటు చేయాలని కూడా తాను యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఉత్తర ప్రదేశ్లో అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa