ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాకింగ్ చేస్తున్న ఎంపీ మెడలోంచి బంగారు గొలుసు చోరీ

national |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 07:16 PM

దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత సురక్షితమైన ప్రాంతంలో కూడా మహిళలకు రక్షణ కరువవుతోందని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ ఉదయం వాకింగ్‌కు వెళ్లగా.. గుర్తు తెలియని దుండగులు ఆమె నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. సాధారణ మహిళల మెడల్లోంచి గొలుసులు అపహరించడం వంటి వార్తలు మనం ఇప్పటి వరకు చాలానే చూశాం కానీ.. ఏకంగా ఓ ఎంపీ మెడలోంచే చైన్ లాక్కెళ్లి సంచలనం సృష్టించారు. అది కూడా ఢిల్లీలోని హై-సెక్యూరిటీ డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్ అయిన చాణక్యపురిలో చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటనపై సుధా రామకృష్ణన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈ విషయంపై లేఖ రాస్తూ.. దేశ రాజధానిలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు.


సోమవారం ఉదయం సుమారు 6.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఎంపీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె తన సహచర ఎంపీ రాజాతి (డీఎంకే)తో కలిసి ఉదయం వాకింగ్ చేస్తుండగా.. హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి స్కూటర్‌పై వేగంగా వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కొని పారిపోయయినట్లు తెలిపారు. ఈ క్రమంలో తాను కింద పడిపోయి.. మెడకు గాయాలు అయినట్లు వెల్లడించారు. అలాగే దుండగుడు చైన్‌ లాగుతున్న క్రమంలో బట్టలు కూడా లాగగా.. అవి చిరిగిపోయినట్లు వివరించారు. పోగొట్టుకున్న గొలుసు నాలుగు తులాల కంటే ఎక్కువ బరువుగానే ఉంటుందని.. ఘటన తర్వాత సాయం కోసం తాను, ఎంపీ రాజాతి గట్టిగా ఏడుస్తూ కేకలు వేసినట్లు స్పష్టం చేశారు.


 ఈ ఘటన తర్వాత తీవ్ర భయాందోళనకు గురైన సుధా రామకృష్ణన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు. దేశ రాజధానిలో ఉన్న ఒక రక్షిత ప్రాంతంలో.. అది కూడా ఒక పార్లమెంటు సభ్యురాలిగా తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ఆమె ఆ లేఖలో ప్రశ్నించారు. చట్టసభ సభ్యులకు కూడా భద్రత లేకపోతే.. ప్రజలు ఎక్కడ సురక్షితంగా ఉండగలరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ లేఖ హోంమంత్రి కార్యాలయానికి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఈ ఘటన తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa