ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా? మీకెలా తెలుసు?..: రాహుల్‌కు సుప్రీం ప్రశ్న

national |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 07:15 PM

దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ.. నిజమైన భారతీయుడు ఇలా మాట్లాడడు అని ఘాటుగా వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాహుల్ గాంధీపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పరువు నష్టం వేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.


2022 భారత్ జోడో యాత్ర సందర్భంగా.. భారత్-చైనా సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. చైనా సైన్యం మన దేశ భూభాగంలోని 2,000 చదరపు కిలో మీటర్ల భూమిని ఆక్రమించిందని పలుమార్లు ఆరోపించారు. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైనికులను తొక్కేస్తున్నాయని వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదు చేసింది. ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టుకు వెళ్లగా.. మే 29న రాహుల్ గాంధీకి జరిమానా విధించింది.


 దీంతో రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు రాజకీయకంగా ప్రేరేపించబడిందని, కావాలనే తనపై కోపంపై పలువురు ఈ కేసు పెట్టారని వాదించారు. అయితే తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా చైనీయులు 2 వేల చదరపు కిలో మీటర్ల భూమిని స్వాధీనం చేసుకున్నారని మీకు ఎలా తెలుసంటూ వ్యాఖ్యానించింది. అలాగే మీరు నిజమైన భారతీయులు అయితే ఇలా మాట్లాడి ఉండరంటూ చెప్పింది.


లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన మీరు.. ఇలాంటి విషయాలు ప్రజలకు ఎలా చెబుతారని ప్రశ్నించింది. అలాగే పార్లమెంటులో ఈ ప్రశ్నలు ఎందుకు అడగరని కూడా అడిగింది. న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా మరియు అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఆయన పిటిషన్‌ను తోసి పుచ్చుతూ వాక్ స్వాతంత్ర్యం సైన్యాన్ని కించపరిచేలా ఉండకూడదని చెప్పింది. సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై ఒక రాజకీయ నాయకుడు బాధ్యత లేకుండా మాట్లాడటం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలియజేయగా.. అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతకు సంబంధించిన విషయాలపై మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని ఈ సంఘటన సూచిస్తోంది. దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, ప్రజలను గందరగోళానికి గురిచేసేలా వ్యాఖ్యలు చేయకూడదని న్యాయస్థానం పరోక్షంగా హెచ్చరించినట్లు భావించవచ్చు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను అప్పట్లో బీజేపీ తీవ్రంగా ఖండించింది. విపక్ష నాయకులు దేశ భద్రతపై అనవసరంగా సందేహాలను సృష్టించి, సైన్యం మనోబలాన్ని దెబ్బతీస్తున్నారని బీజేపీ ఆరోపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa