కర్ణాటక రాజకీయాల్లో అధికార భాగస్వామ్యంపై కొనసాగుతున్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ ఢిల్లీలో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. కొంతమంది అధికారాన్ని పంచుకోవడానికి ఇష్టపడరంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు పరోక్షంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఉద్దేశించి చేసినవేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో డీకే శివకుమార్ మొదట కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని ప్రశంసించారు. 2004లో ప్రధానమంత్రి పదవిని స్వీకరించడానికి ఆమె నిరాకరించి గొప్ప త్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంలోనే ఆయన మాట్లాడుతూ.. అధికారం అనేది ఒక బలం అని తెలిపారు. అది మనకు లభించినప్పుడు దానిని పంచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఇది పార్టీని, ప్రజలను బలోపేతం చేస్తుందన్నారు. కానీ కొంతమంది.. కనీసం చిన్న పదవిని కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఉండరని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకున్నారని చెప్పడం ద్వారా పదవిని పట్టుకోని వేలాడొద్దు అనే భావన వ్యక్తమయ్యేలా డీకే వ్యాఖ్యలు ఉన్నాయి.
అంతేకాకుండా శివకుమార్ తన రాజకీయ జీవితం, పార్టీ కోసం తాను చేసిన కృషి గురించి కూడా ఈ వేదికపై వివరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తాను ఎంతో శ్రమించానని పరోక్షంగా గుర్తు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవిగా ఐదేళ్లపాటు తానే కొనసాగుతానని సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా డీకే శివకుమార్ ఇలా స్పందించి ఉంటారని అందరూ భావిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. పార్టీ అధిష్టానం జోక్యంతో.. సిఎం పదవిని సిద్ధరామయ్యకు అప్పగించి, డీకే శివకుమార్కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన శాఖలను అప్పగించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అధికార పంపిణీపై ఒక రహస్య ఒప్పందం కుదిరిందని, 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల సీఎం సిద్ధరామయ్య ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తూ.. తాను పూర్తి ఐదేళ్ల పదవీ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఆ వివాదాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa