ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్‌లో.. వందే భారత్ స్లీపర్ రైలు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 05:16 PM

భారతీయ రైల్వే చరిత్రలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ రైలు ప్రయాణికులకు ఒక విలాసవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కొత్త రైలు రాక భారతీయ రైల్వేలలో ఒక విప్లవాత్మక మార్పుగా ఆయన అభివర్ణించారు.


మంత్రి అశ్విని వైష్ణవ్ భావ్‌నగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో డిజిటల్ పద్ధతిలో మూడు కొత్త రైళ్లను ప్రారంభించారు. వీటిలో అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా-పుణె ఎక్స్‌ప్రెస్, జబల్‌పూర్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఈ సందర్భంగానే ఆయన వందే భారత్ స్లీపర్ రైలు ప్రయోగం గురించి కీలక ప్రకటన చేశారు. ఈ రైలు రాకతో సుదూర ప్రయాణాలు మరింత సులువుగా, వేగంగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఎనిమిది కొత్త అమృత్ భారత్ రైళ్లను కూడా ప్రవేశ పెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కొత్త రైళ్ల ద్వారా దేశవ్యాప్తంగా రైలు కనెక్టివిటీ, సేవలు మరింత మెరుగుపడతాయని ఆయన నొక్కి చెప్పారు.


వందే భారత్ స్లీపర్ రైలు ఒక సాధారణ స్లీపర్ కోచ్ రైలు కాదని.. ఇది ఆధునిక సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించబడిందని వివరించారు. వేగం, భద్రత, సౌకర్యం దీని ప్రత్యేకతలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లు చైర్ కార్ మోడల్‌లో పగటిపూట ప్రయాణానికి అనువుగా ఉన్నాయి. అయితే ఈ స్లీపర్ రైలు రాత్రి ప్రయాణాలకు ప్రత్యేకంగా రూపొందించబడింది. సుదీర్ఘ ప్రయాణాలలో ప్రయాణికులు సుఖంగా నిద్రపోవడానికి, విలాసవంతమైన సేవలు పొందడానికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ రైలులో మెరుగైన బెడ్డింగ్, పడకలను అనుసంధానించిన ప్రత్యేక లైటింగ్, విశాలమైన బాత్రూమ్‌లు, సెన్సార్ ఆధారిత తలుపులు, మరియు మెరుగైన ఎయిర్ కండిషనింగ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.


ఇప్పటి వరకు దేశంలో మొత్తంగా 50 కంటే ఎక్కువ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ అవి చైర్ కార్ సౌకర్యంతో శతాబ్ది రూట్‌లలో నడుస్తున్నాయి. ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను మాత్రం రాజధాని రూట్లలో నడిచేలా రూపొందించారు. ఈ రైళ్లు గంటకు 180 కిలో మీటర్ల వేగంతో పరుగులు పెడుతాయి. ఏపీ ఫస్ట్ క్లార్, ఏసీ 2 టయర్, ఏసీ 3 టయర్ సహా 16 కోచ్‌లతో.. 1128 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని ఈ రైళ్లు కల్గి ఉంటాయి. ఇవి న్యూఢిల్లీ-హౌరా, న్యూఢిల్లీ-ముంబయి, న్యూఢిల్లీ-పుణే, న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య నడిచే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో రైల్వే బోర్డుదే తుది నిర్ణయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa