దేవభూమి ఉత్తరాఖండ్పై ప్రకృతి కన్నెర్ర జేసింది. ఉత్తర కాశీ జిల్లాలో మంగళవారం క్లౌడ్బరస్ట్తో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ పెను విపత్తులో 50 మందికిపైగా గల్లంతయ్యారు. కుండపోత వర్షానికి ఖీర్ గంగా నదీకి వరద పోటెత్తి.. ఖీర్బద్, థరాలి గ్రామాలను ముంచెత్తింది. కొండలపై నుంచి వచ్చిన భారీ ప్రవాహంలో పలు ఇళ్లు కొట్టుకుపోగా.. అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. మెరుపు వరద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామస్థులు భయాందోళనతో అరుస్తూ పరుగులు తీస్తుండటం వీడియోల్లో కనిపిస్తుంది. ఇప్పటి వరకూ నలుగురు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అయితే, ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. గత కొద్ది రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఉత్తర కాశీలోని ధరాలి ప్రాంతంలో ఆకస్మిక వరదలతో తీవ్ర నష్టం సంభవించిన వార్త చాలా బాధాకరం.. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం, ఇతర బృందాలు సహాయ, రక్షణ చర్యలలో నిమగ్నమై ఉన్నాయి... సీనియర్ అధికారులతో నిరంతర సమన్వయం చేసుకుని.. పరిస్థితిని సమీక్షిస్తున్నాం.. అక్కడి ప్రజల క్షేమం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్ ( ట్విట్టర్)లో ధామి పోస్ట్ చేశారు. ఇక, ఉత్తరాఖండ్లో విపత్తులు, హెలికాప్టర్, బస్సు ప్రమాదాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఇక, వరదల బీభత్సంపై స్పందించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.. ఉత్తరాఖండ్ సీఎం ధామికి ఫోన్ చేసి మాట్లాడారు. అవసరమైతే మరిన్ని బలగాలను రంగంలోకి దింపుతామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరాఖండ్లో ఎడతెరిపిలేని భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో హరిద్వార్లో గంగా సహా అనేక ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సోమవారం రుద్రప్రయాగ్ జిల్లాల్లో కురిసిన వర్షానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొండచరియల విరిగిపడి.. రాళ్లు, మట్టితో షాపులు పూర్తిగా కూరుకుపోయాయి. అంతకుముందు రోజు ఆదివారం నాడు ఉద్ధమమ్ సింగ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలకు లేవ్డా, దాని ఉపనదులు, వాగులు ఉధృతంగా ప్రవహించాయి. దీంతో రాంపూర్-నైనిటాల్ ప్రధాన రహదారి, చకర్పూర్, లఖన్పూర్, పిస్టోర్, బర్హైని గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి.
ఈ భారీ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్ుట భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం కొండ ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్'జారీ చేసింది. అలాగే, *ఈ వారం మొత్తం ‘ఎల్లో అలర్ట్’ను కూడా ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa