ఓవల్ టెస్టులో మహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్తో భారత్ గెలుపొందడంపై ఇంగ్లండ్ కోచ్ మెక్కల్లమ్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడని దినేష్ కార్తీక్ తెలిపాడు. మొదట శుభమన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవుతాడని మెక్కల్లమ్ భావించినా, సిరాజ్ ప్రదర్శనతో అతడికే ఆ అవార్డు ఇవ్వాలని అనుకున్నాడట. అయితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గిల్, హ్యారీ బ్రూక్ పంచుకున్నారు. సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఓవల్ టెస్టు ఆఖరి రోజు ఆటను ఇప్పుడల్లా ఇంగ్లండ్, ఇండియా క్రికెట్ అభిమానులు మరచిపోలేరు. ముఖ్యంగా లాస్ట్ వికెట్ సెలబ్రేషన్స్ అలానే మైండ్లో ఉండిపోయాయి. చివరి రోజు ఇంగ్లండ్ టెయిలెండర్స్ను ముచ్చెమటలు పట్టించి మ్యాచ్ని గెలిపించిన మహమ్మద్ సిరాజ్ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో గట్టిగా వినిపిస్తోంది. ఐదో రోజు ఆట తర్వాత ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడని దినేష్ కార్తీక్ వెల్లడించాడు.
అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ - ఇండియా మధ్య జరిగిన చివరి టెస్టు నాలుగో రోజు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గురించి బ్రెండన్ మెక్కల్లమ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ సిరీస్లో అద్భుతంగా రాణించిన టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ ఆ అవార్డుకు అర్హుడని మెక్కల్లమ్ నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కానీ ఆఖరి రోజు సిరాజ్ బౌలింగ్ చూసిన మెక్కల్లమ్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడని స్కై స్పోర్ట్స్ కామెంట్రీ ప్యానెల్లో భాగమైన కార్తీక్.. క్రిక్ బజ్ వేదికగా వివరించాడు.
"మ్యాచ్ నాలుగో రోజే ముగిసినట్లయితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు శుభమన్ గిల్ ఇప్పటిలాగే తీసుకునేవాడు. ఇంగ్లండ్ కోచ్ మెక్కల్లమ్ కూడా అతని పేరును ప్రతిపాదించాడు. కామెంటేటర్ మైక్ అథర్టన్ కూడా అందుకు సంబంధించిన ప్రశ్నలు సిద్ధం చేసుకున్నాడు. కానీ మ్యాచ్ ఐదో రోజుకు వెళ్లింది. సిరాజ్ అద్భుత ప్రదర్శనతో భారత్ను గెలిపించాడు. దీంతో మెక్కల్లమ్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. సిరాజ్కే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం మెక్ కల్లమ్కు వచ్చి ఉంటుంది" అని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ - ఇండియా మధ్య జరిగిన ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్కి దక్కింది. ఆఖరి టెస్టులో తొమ్మిది వికెట్లు పడగొట్టిన మహమ్మద్ సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆఖరి టెస్టు అనంతరం ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ సిరాజ్ను ఆకాశానికి ఎత్తాడు. సిరాజ్ ఎంతో ఎనర్జీతో బౌలింగ్ చేశాడంటూ మెక్కల్లమ్ కితాబిచ్చాడు. ముఖ్యంగా ఆఖరి రోజు సిరాజ్ వేసిన స్పెల్ సిరీస్ మొత్తాన్నే మార్చేసిందని, నిజంగా అద్భుతంగా అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. బుమ్రా లేని సమయంలో సిరాజ్ నాయకుడిలా ముందు నుంచి నడిపించాడంటూ దినేష్ కార్తీక్ అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa