ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవదేవుని ఆలయంలో ఇదేం పనులు.. ఎమ్మెల్యే గంటా ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 10, 2025, 06:40 PM

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో దాతల సహకారంతో చేపట్టిన పనులపై వారి బ్రాండ్ లేక పేర్లు వేయించడంపై మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పన్న వార్షిక కళ్యాణం నిర్వహించే ప్రాంగణంలో షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గంటా ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల వ్యయంతో ఈ వేదిక నిర్మాణానికి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ముందుకొచ్చింది. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయాల్లో ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి దాతలు వారి పేర్లు వేసుకోవడంపై మండిపడ్డారు.


ఇటీవల సింహాగిరిపై వైకుంఠవాసుని మెట్టవద్ద రూ.కోటి వ్యయంతో జీఆర్టీ సంస్థ తిరునామం ఏర్పాటు చేసింది. అయితే, ఈ నామంపై ఆ సంస్థ లోగో వేసుకోవడం పట్ల భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు.. స్వామివారి నామాల ప్రక్కన వారి పేరు ఎలా వేయిస్తారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే వాటిని తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని ఈవోకు సూచించారు. అలాగే, త్వరలో సింహాచలం దేవస్థానంలో కూడా ట్రస్ట్ బోర్డును నియమిస్తారని అన్నారు.


ఇదే సమయంలో ఎండాడ భూములకు సంబంధించి తనపై, స్పీకర్ అయ్యన్న పాత్రుడుపై వచ్చిన ఆరోపణలను మాజీ మంత్రి కొట్టిపారేశారు.. తక్షణమే ఆ భూములకు సంబంధించి విచారణ చేయించాలని ప్రభుత్వానికి తాను, అయ్యన్న పాత్రుడు కూడా లేఖ రాశామని చెప్పారు. ఆ భూములు నా నియోజకవర్గ పరిధిలో ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.


షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం స్వామివారిని దర్శించుకున్న గంటా.. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంటాకు ఆలయ అధికారులు, వైదిక వర్గాలు ఘన స్వాగతం పలికారు. కాగా, శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని సింహ్రాద్రి అప్పన్న స్వామివారికి కరాళ చందనం సమర్పణ శనివారం సంప్రదాయబద్ధంగా జరిగింది. వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపిన అర్చకులు.. ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సుగంధద్రవ్యాలు, కస్తూరి మిళితం చేసిన శ్రీగంధాన్ని స్వామివారికి సమర్పించారు. ఆరాధన, బాలభోగం, రాజభోగం అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. అనంతరం సాయంత్రం స్వామి, అమ్మవార్లకు గ్రామ తిరువీధి వేడుక నిర్వహించారు. దేవతామూర్తులను పల్లకిలో అధిష్ఠింపజేసి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సింహగిరి మాడవీధుల్లో ఊరేగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa