దేశానికి వెన్నెముక రైతన్నలు. అలాంటి రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతూ ఉంటాయి. అలాగే పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖిభవ వంటి పథకాలను కూడా అమలు చేస్తున్నాయి. వీటితో పాటుగా వాతావరణ ఆధారిత బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాల ద్వారా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నాయి. అయితే ప్రభుత్వాలు అమలు చేసే ఏ సంక్షేమ పథకానికి అయినా పంట నమోదు అనేది తప్పనిసరి. వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ - పంట నమోదు చేస్తుంటారు. అర్హులైన రైతులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోఈ - క్రాపింగ్ పద్ధతిని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
అయితే పంట నమోదులో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు.. రైతులకు ఒక్కోసారి ఇబ్బందులు తెప్పిస్తుంటాయి. ఈ సాంకేతిక సమస్యల కారణంగా ప్రభుత్వ ప్రయోజనాలు అందక కొన్నిసార్లు నష్టపోతుంటారు కూడా. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ-పంట డిజిటల్ క్రాప్ సర్వే యాప్లో మార్పులు చేస్తున్నారు. దీని ద్వారా అర్హులైన రైతులు అందరికీ మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గతంలో పంట నమోదు కోసం యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ యాప్ ఉపయోగించేవారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ యాప్ వాడకాన్ని రద్దు చేసింది. దాని స్థానంలో 2025 ఖరీఫ్ సీజన్లో నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా ఈ-పంట డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో మరో అప్లికేషన్ తెచ్చింది. ఈ- పంట డిజిటల్ క్రాప్ సర్వేలో సాగు భూముల వివరాలు కచ్చితంగా ఉండేలా చూడాలని ఏపీ ప్రభుత్వం తాజాగా గైడ్లైన్స్ జారీ చేసింది.
ఈ - పంట డిజిటల్ క్రాప్ సర్వేలో.. వ్యవసాయ పంటలకు ఏఓ, ఉద్యాన పంటలకు హార్టికల్చర్ ఆఫీసర్, ప్రభుత్వ, వ్యవసాయేతర భూములకు ఎమ్మార్వోలు బాధ్యులుగా ఉంటారు. వీరంతా ఆయా భూములను, పంటల సాగు, రికార్డులు వంటి వివరాలను పర్యవేక్షిస్తారు. ఈ రికార్డుల ఆధారంగా ఆర్ఎస్కేల సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సి ఉంటుంది. అలాగే సర్వే సమయంలో రైతుకు ఎకరా కంటే తక్కువ భూమి ఉన్నట్లయితే ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ భూమిలో పంట ఉన్నా, లేకపోయినా కూడా ఫోటో తీయాల్సి ఉంటుంది. అలాగే రైతు సేవా కేంద్రాల సిబ్బంది కూడా తమ పరిధిలోని రెవెన్యూ గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ భూములను మ్యాపింగ్ చేయాలి. ఇందుకు వీలుగా వారి ఫోన్లు సిద్ధం చేసుకుంటేనే యాప్ పనిచేస్తుందని అధికారులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa