ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధోనీ ఐపీఎల్ 2026 ఆడాల్సిందేనన్న అభిమాని.. మహీ రియాక్షన్

sports |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 11:02 PM

ఐపీఎల్ 2026 కోసం ఇప్పటికే చాలా ఫ్రాంఛైజీలు ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసి.. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన సీఎస్కే.. ఐపీఎల్ 2026 వేలంపై దృష్టిసారించింది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్ సహా సీఎస్కే మేనేజ్‌మెంట్ సమావేశమై ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ధోనీ వచ్చే సీజన్‌లో ఆడతాడా.. లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.


 ఐపీఎల్ 2025లో సీఎస్కే చివరి మ్యాచ్ ఆడినప్పుడు ధోనీ మాట్లాడుతూ.. దానికి ఇంకా టైమ్ ఉందని.. అప్పుడే డిసైడ్ అవుతాడని పేర్కొన్నాడు. తాజాగా మరోసారి ధోనీకి అదే ప్రశ్న ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని.. సీఎస్కే అభిమాని ఒకరు.. "మీరు తప్పకుండా వచ్చే సీజన్‌లో సీఎస్కే తరఫున ఆడాలి?" అని అడిగాడు. దీనికి ధోనీ ఇచ్చిన స్పందన నవ్వులు పూయిస్తోంది. "మీరు చెబుతున్నారు సరే.. నా మోకాలు నొప్పిగా ఉంది.. దాన్ని ఎవరు భరిస్తారు?" అని వ్యాఖ్యానించాడు. దీంతో అక్కడుకున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


నిజానికి ఈ కార్యక్రమం ప్రారంభం ముందే ధోనీకి ఇదే ప్రశ్న ఎదురైంది. అప్పుడు ధోనీ మాట్లాడుతూ.. "నేను ఐపీఎల్ 2026 సీజన్ ఆడతానో లేదో తెలియదు. అందుకు ఇంకా టైమ్ ఉంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఈ ఏడాది డిసెంబర్ వరకు ఆలోచిస్తా. కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేను. తప్పకుండా దీనిపై అప్పుడే క్లారిటీ ఇస్తా" అని ధోనీ అన్నాడు.


కాగా గత సీజన్‌లో సీఎస్కే పేలవ ప్రదర్శన చేసింది. దీంతో జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 2026 వేలంలో కీలక ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. ఇక తనను రిలీజ్ చేయాలని సంజూ శాంసన్‌.. రాజస్థాన్ రాయల్స్‌ను కోరాడట. దీంతో అతడిని సీఎస్కే దక్కించుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa