క్రికెటర్లు ఎవరైనా మ్యాచ్ ఉందంటే.. ఎంతో ప్రాక్టీస్ చేస్తారు. మ్యాచులో సరైన ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంగా కాస్త త్వరగానే నిద్రలేచి.. వీలైనంత సమయం గ్రౌండ్లోనే గడపాలని భావిస్తారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ వెస్టిండీస్కు చెందిన షిమ్రాన్ హిట్మెయిర్ మాత్ర ఇందుకు భిన్నమట. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకూ కూడా అతడు నిద్రపోతాడట. ఈ విషయాన్ని ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ వెల్లడించాడు.
రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా సంజూ శాంసన్ ఉండగా.. గత కొన్నేళ్లుగా షిమ్రాన్ హెట్మెయిర్ అదే జట్టు తరఫున ఆడుతుండటం గమనార్హం. ఈ సందర్భంగా అశ్విన్తో ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ సహా సహచరుల గురించి మాట్లాడాడు.
షిమ్రాన్ హిట్మెయిర్ స్పెషల్..
"షిమ్రాన్ హెట్మెయిర్ మ్యాచ్ డే రొటీన్ భిన్నంగా ఉంటుంది. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఉంటే అతడు సాయంత్రం 5 గంటలకు నిద్రలేస్తాడు. అప్పటివరకూ నిద్రలేవడు. టీమ్ మీటింగ్స్ సమయంలోనూ అతడు నిద్రమత్తులో తూలుతూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే క్రీజులో దిగుతాడో.. జట్టుకు అవసరమైన కీలకమైన రన్స్ చేస్తాడు. మ్యాచులను గెలిపిస్తాడు. అతడి సక్సెస్కు అదొక మార్గం కావచ్చేమో" అని సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్పై కూడా సంజూ కీలక వ్యాఖ్యలు చేశాడు. "రాజస్థాన్ రాయల్స్ అనేది నా ప్రపంచం. కేరళలోని ఒక గ్రామం నుంచి వచ్చిన నాకు రాహుల్ ద్రవిడ్ సర్, రాజస్థాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ బాదాలే అవకాశం ఇచ్చారు. ఐపీఎల్ ద్వారా నాకు వేదికను ఇచ్చి.. ఈ ప్రపంచానికి నువ్వేంటో చాటి చెప్పు అన్నారు. నాకు అండగా నిలిచారు. ఆ జట్టుతో నా ప్రయాణం గొప్పగా సాగింది. ఆ ఫ్రాంచైజీకి ఎప్పటికీ రుణపడి ఉంటా" అని సంజూ వ్యాఖ్యానించాడు. అయితే ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ను వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa